Pavan Hot seat : వందకు 250, వందకు 400.. పిఠాపురంపై కోట్లల్లో బెట్టింగ్స్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల 409 ఓట్లు ఉండగా... 2 లక్షల 4 వేల 811 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు.

 

 

 

రాష్ట్రంలోనే పిఠాపురం హాట్ సీట్ గా మారింది… పవన్ కళ్యాణ్ గెలుపోటములు మెజారిటీపై కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతోంది. రాష్ట్రంలో మిగతా నియోజకవర్గాలు ఒక ఎత్తయితే… ఒక్క పిఠాపురం పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు పందెం రాయుళ్లు.. రకరకాల బెట్టింగ్ లు, దిమ్మ తిరిగి బొమ్మ కనపడే రేషియోలతో ఆఫర్లు ఇచ్చి అట్రాక్ట్ చేస్తున్నారు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. నియోజవర్గంలో మొత్తం 2 లక్షల 36 వేల 409 ఓట్లు ఉండగా… 2 లక్షల 4 వేల 811 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో 86.63% పోలింగ్ నమోదయింది. అయితే ఈ నియోజకవర్గం ఇప్పుడు పందెం రాయుళ్ళకు హాట్ కేక్ గా మారింది. ఎక్కడా లేనివిధంగా కోట్ల రూపాయలు పిఠాపురం ఫోకస్ గానే చేతులు మారుతున్నాయి. పవన్ కళ్యాణ్ మెజార్టీ టార్గెట్ గా బెట్టింగ్ జరుగుతోంది. జనసేన అధ్యక్షుడు 50వేల మెజార్టీతో గెలుస్తాడని రూపాయి పెడితే.. రెండు రూపాయలు ఆఫర్ చేస్తున్నారు. 40 వేలు వస్తుందని కాన్ఫిడెన్స్ ఉంటే రూపాయికి రూపాయిన్నర ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. ఉదాహరణకు పవన్ కళ్యాణ్ మెజారిటీ 50 వేలు దాటుతుందని లక్ష రూపాయలు పందెం కడితే.. చెప్పినట్లు జరిగితే లక్షకు రెండు లక్షలు ఇస్తారు.

40వేల దాటుతుందని నమ్మకం ఉంటే లక్షకు లక్షన్నర ఇస్తారు. 30వేలు అనుకుంటే లక్షకు… లక్ష ఇలా రకరకాల ఆఫర్లు ఇస్తున్నారు. నియోజకవర్గంలో మూడు మండలాలు రెండు మున్సిపాలిటీలు ఉన్నాయి. పిఠాపురం, గొల్లప్రోలు, యు కొత్తపల్లి మండలాలు, పిఠాపురం గొల్లప్రోలు మున్సిపాలిటీలు ఉన్నాయి. కొన్నిచోట్ల మండలాల వారీగా బెట్టింగ్ కూడా జరుగుతోంది. ఏ మండలంలో ఎవరు లీడ్ సాధిస్తారు. ఏ గ్రామంలో ఎవరి ప్రభావం ఉంటుంది ఇలా రకరకాలుగా ఓపెన్ ఆఫర్లు ఇస్తున్నారు. ఒక్కరే రకరకాల పందాల్లో పాల్గొంటున్నారు. మొత్తం పోలైన ఓట్లలో గెలుపోటములు ఎలా ఉన్నప్పటికీ… వైసీపీ అభ్యర్థి వంగా గీతకు 40% ఓట్లు తక్కువ రాదని ఒక పందెం జరుగుతోంది. అంటే మొత్తం 2 లక్షల 4 వేల 811 మంది ఓటు వేస్తే గీతకి కచ్చితంగా 80వేల ఓట్లు వస్తాయని ఒక ఆఫర్ ఇస్తున్నారు. దానికి లక్షకి మూడు లక్షలు డిసైడ్ చేస్తున్నారు, ఆన్ లైన్ లో కూడా ఈ పందాలు జరుగుతున్నాయి.

పిఠాపురం చరిత్రలో గతంలో ఎప్పుడూ లేని మెజారిటీ పవన్ కళ్యాణ్ కి వస్తుందని ఒక ప్రపోజల్ నడుస్తోంది. 2014లో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన వర్మ 47 వేల 80 ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు. పిఠాపురం చరిత్రలో అదే ఎక్కువ మెజారిటీ… ఆ మెజారిటీ కంటే ఒక్క ఓటు ఎక్కువగా వచ్చినా పందెం గెలిచినట్లు అవుతుంది. దానికి 1:3 రేషియోలో డబ్బులు ఆఫర్ చేస్తున్నారు… అంటే లక్షకు మూడు లక్షలు ఇస్తారు. దానికీ ఒక కండిషన్ కూడా పెట్టారు. 10 లక్షల కంటే తక్కువగా ఉంటే ఆ పందెం యాక్సెప్ట్ చేయరు. అంటే పది లక్షల పెట్టుబడి పెడితే… పవన్ కళ్యాణ్ కు పిఠాపురం హిస్టరీలో హైయెస్ట్ మెజారిటీ వస్తే 30 లక్షలు సంపాదించవచ్చు… కొన్నిచోట్ల నలుగురు ముగ్గురు కలిసి ఒక టీం గా ఏర్పడి పందానికి సై అంటున్నారు. పిఠాపురంలో మొత్తం 240 పోలింగ్ బూత్ లు ఉన్నాయి.

ఏ బూత్ లో ఎవరికి ఎక్కువ మెజారిటీ వస్తుందని కూడా బెట్టింగ్ జరుగుతోంది. ఇతర ప్రాంతాలలో ఉన్న వారు కూడా పిఠాపురంపై బెట్టింగ్ పెట్టడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. విదేశాల్లో ఉన్నవారు ఆన్లైన్ ద్వారా ఈ బెట్టింగ్స్ లో పాల్గొంటున్నారు.. మధ్యవర్తుల ద్వారా డీల్ సెట్ చేసుకుంటున్నారు. 54 గ్రామాల్లో ఏ గ్రామంలో ఎవరు సత్తా చాటుతారు అంటూ లోకల్ గా బెట్టింగ్ వేసుకుంటున్నారు. పార్టీలతో సంబంధం లేకుండా ఎవరికి నచ్చిన పర్సన్ మీద ఎంత మెజారిటీ వస్తుందనుకుంటే అంత మెజారిటీకి బెట్టింగ్ కి సిద్దమవుతున్నారు. కొన్నిచోట్ల పొలాలు, ఇళ్ళు కూడా దస్తావేజు బాండ్ పేపర్ ల మీద రాసుకుని పిఠాపురం బెట్టింగ్ ల్లో పాల్గొంటున్నారు. చోటా మోటా బెట్టింగ్ లు లక్షల్లో జరుగుతుంటే కోట్లలో బెట్టింగ్ లకు సిద్ధమయ్యే వాళ్ళు ఉన్నారు.. సింపుల్ గా డీల్ సెట్ చేసుకొని జూన్ 4 వరకు ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు.

పవన్ కళ్యాణ్ మెజారిటీ పైనే ఎక్కువగా ఫోకస్ చేశారు పందెం రాయుళ్లు… షరతులు వర్తిస్తాయి అంటూ అందరికీ ఓపెన్ ఆఫర్ లు ఇస్తూ తమ వైపు తిప్పుకుంటున్నారు. మొత్తానికి ఏపీలో పందెం రాయుళ్లు పిఠాపురంపైనే ఎక్కువగా బెట్టింగ్ వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మెజారిటీ ఆధారంగా కోట్ల రూపాయలు చేతులు మారే పరిస్థితి ఉంది. దానికి తగ్గట్లుగా నియోజకవర్గంలో హైప్ క్రియేట్ అయింది. మరోవైపు బెట్టింగ్ నిర్వహించిన నిర్వాహకులు సైతం పర్సంటేజీలు తీసుకుంటున్నారు.