Janasena Glass : గ్లాసు పూర్తిగా జనసేనదే

జనసేనకు ఇక గుర్తు కష్టాలు తీరినట్టే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గాజు గ్లాస్‌ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పినట్టే. 2024 ఎన్నికలు పవన్‌ పార్టీని కష్టాల నుంచి గట్టున పడేసినట్టే అంటున్నారు. జనసేన ఇక నమోదైన పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీ హోదా పొందబోతోంది

  • Written By:
  • Updated On - June 5, 2024 / 04:12 PM IST

జనసేనకు ఇక గుర్తు కష్టాలు తీరినట్టే. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ గాజు గ్లాస్‌ కోసం కోర్టుల చుట్టూ తిరగాల్సిన అవసరం తప్పినట్టే. 2024 ఎన్నికలు పవన్‌ పార్టీని కష్టాల నుంచి గట్టున పడేసినట్టే అంటున్నారు. జనసేన ఇక నమోదైన పార్టీ నుంచి గుర్తింపు పొందిన పార్టీ హోదా పొందబోతోంది
గాజు గ్లాస్‌…. పార్టీ ఆవిర్భావం నుంచి జనసేన ఎన్నికల గుర్తు. కానీ… పుట్టిన నాటి నుంచి ఎప్పుడూ గుర్తు టెన్షనే వెంటాడుతోంది జనసేనను. కారణం…. ఆ గుర్తు ఫ్రీ సింబల్స్‌ లిస్ట్‌లో ఉండటమే. ఎలక్షన్స్‌ జరిగిన ప్రతిసారీ…. కావాలని కొందరు, కాకతాళీయంగా మరికొందరు ఇండిపెండెంట్‌ అభ్యర్థులు గాజు గ్లాస్‌ గుర్తు కోసం రిక్వెస్ట్‌లు పెట్టడం, దాని కోసం జనసేన న్యాయ పోరాటం చేయాల్సి రావడం జరుగుతోంది. ఈ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా సేమ్‌ సీన్‌ రిపీట్‌ అయింది.
సింబల్‌ కోసం హైకోర్ట్‌ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. ఆ గుర్తును జనసేనకే ఇవ్వాలని తీర్పు చెప్పిన కోర్ట్‌…..అది ఆ పార్టీ పోటీ చేసే నియోజకవర్గాలకు మాత్రమే పరిమితమంటూ రూల్‌ పెట్టింది ఫ్రీ సింబల్స్‌ లిస్ట్‌లో ఉన్నందున మిగతా నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్స్‌కు గ్లాస్‌ను కేటాయించింది ఈసీ. ఇది తమకు మైనస్‌ అవుతుందని ముందు కూటమి పార్టీలు భయపడ్డాయి. అందుకు తగ్గట్టే వైసీపీ కొందరు ఇండిపెండెంట్స్‌ని ఆ దిశగా ప్రోత్సహించిందన్న వార్తలు కంగారు పెట్టాయి. కానీ… ఫలితాల తర్వాత అలాంటిదేమీ లేదని తేలిపోగా…. ఇప్పుడు చర్చంతా ఇక మీదట అయినా… గాజు గ్లాస్‌ గుర్తు జనసేనకు పర్మినెంట్‌గా ఉంటుందా అన్న అంశం చుట్టూ తిరుగుతోంది. ప్రస్తుతం జనసేన రిజిస్టర్డ్‌ పార్టీ మాత్రమే. అది రికగ్నైజ్డ్‌ పార్టీగా మారాలంటే కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇన్నాళ్ళు వాటిని చేరుకోలేక పోయిన జనసేన… ఈసారి ఏపీలో ఘన విజయంతో తన గుర్తును పదిలం చేసుకోగలుగుతుంది. సాధారణంగా ఒక ప్రాంతీయ పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించాలంటే…. అసెంబ్లీ ఎలక్షన్స్‌లో చెల్లుబాటైన ఓట్లలో 6శాతం ఓట్లు ఆ పార్టీకి వచ్చి ఉండాలి. అలాగే కనీసం రెండు ఎమ్మెల్యే సీట్లు అయినా గెలవాలి. దాంతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఆరు శాతం ఓట్లు సాధించి కనీసం ఒక్క ఎంపీ సీటు గెలిచి ఉండాలి. ప్రస్తుత అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో జనసేనకు ఆ నిబంధనలకు మించే ఓట్లు, సీట్లు వచ్చినందున ఇక సింబల్‌ టెన్షన్‌ తీరినట్టేనంటున్నారు పరిశీలకులు. ఇక మీదట ఏ ఎన్నికలైనా… పర్మినెంట్‌గా గాజు గ్లాస్‌ గుర్తుతోనే… ఎలాంటి గండాలు లేకుండా పోటీ చేయడానికి లైన్‌ క్లియర్‌ అయింది. ఈ ఎన్నికలు జనసేనకు మాంఛి బూస్ట్‌ ఇవ్వడంతో పాటు ఒక పెద్ద కష్టాన్ని తీర్చినట్టయింది.