YS Jagan : జగన్‌ను దెబ్బతీయడమే లక్ష్యం.. షర్మిల మాస్టర్‌ప్లాన్‌…

ఏపీ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయ్. కూటమి అధికారంలోకి రావడం.. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కపోవడం.. ఇలాంటి పరిణామాల మధ్య వైఎస్ తనయ షర్మిల..

 

 

 

ఏపీ రాజకీయాలు థ్రిల్లర్ సినిమాను తలపిస్తున్నాయ్. కూటమి అధికారంలోకి రావడం.. వైసీపీకి కనీసం ప్రతిపక్ష హోదా దక్కపోవడం.. ఇలాంటి పరిణామాల మధ్య వైఎస్ తనయ షర్మిల.. వేగంగా పావులు కదపడం.. రాజకీయాల్లో సెగలు పుట్టిస్తున్నాయ్. జగన్‌ పేరు చెప్తేనే రగిలిపోతున్న షర్మిల.. వైసీపీని స్వీప్‌ చేయడమే లక్ష్యంగా పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారనే ప్రచారం రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది. వైఎస్‌ జయంతికి ముందు.. జయంతి తర్వాత అన్నట్లుగా పరిణామాలు కనిపించడం ఖాయం అంటున్నారు. ఏపీసీసీ చీఫ్‌గా షర్మిల ఉన్నారు. వైఎస్ సానుభూతిపరులు, వైసీపీ వ్యతిరేకులు అంతా.. కాంగ్రెస్‌లో చేరుతారని ఎన్నికల ముందు చర్చ జరిగింది. ఐతే కొందరు మాత్రమే కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. అదీ వైసీపీ నుంచి టికెట్‌ దక్కనివాళ్లు.

ఇక కాంగ్రెస్‌కు ఊపిరిలూదడం కష్టం అనుకున్న సమయంలో.. ఫలితాలు హస్తం ఫేట్ మార్చే పరిస్థితులు కనిపిస్తున్నాయ్. ఇప్పుడు ఏపీలో పొలిటికల్ సీన్ పూర్తిగా మారిపోయింది. జనాల్లో జగన్‌ పాపులారిటీ తగ్గింది అని షర్మిల లెక్కలేస్తున్నారు. దీనికితోడు 164స్థానాలతో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐతే ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ టార్గెట్‌గా చంద్రబాబు సర్కార్‌ చర్యలకు దిగుతోంది. జగన్ హయాంలో జరిగిన దారుణాలను.. రోజుకొకటి చొప్పున బయటకు తీస్తోంది. నిజానికి ప్రతిపక్ష హోదా కూడా లేని వైసీపీ విషయంలో ఇంత సీరియస్‌గా ఉండాల్సిన అవసరం లేకపోయినా.. జగన్‌ ఓటు బ్యాంక్‌ టార్గెట్‌గానే ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం వైసీపీకి 11మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అందులోనూ ఇద్దరు ముగ్గురు బయటకు వస్తారని టాక్. ఐతే జగన్ సర్కార్‌ బాగోతాలను బయటపెట్టడం ద్వారా.. వైసీపీ 40శాతం ఓటు బ్యాంకు తగ్గించొచ్చని చంద్రబాబు సర్కార్ ప్లాన్‌.

ఇది సక్సెస్ అయితే.. జగన్‌ మీద నాయకులకు విశ్వాసం తగ్గి.. నాయకులు కూడా వీక్ అయ్యే అవకాశం ఉంటుంది. సరిగ్గా ఈ అవకాశం కోసమే షర్మిల ఎదురుచూస్తున్నారనే టాక్ నడుస్తోంది. వైసీపీ ఖాళీ అయ్యే రోజులు ఖాయంగా వస్తుందని.. జంపింగ్‌లను తన పార్టీ వైపు లాగేయాలని షర్మిల ప్లాన్ చేస్తున్నారట. ఒకప్పుడు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన వారు, కీలక ప‌ద‌వులు అనుభవించిన వారు, పార్టీ అధిష్టానంతో ఇప్పటికీ సంబంధాలు కొనసాగిస్తున్న వారు.. వైసీపీలో ఉన్నారు. వారందరినీ కాంగ్రెస్ వైపు మళ్లీ లాగాలని షర్మిల ప్లాన్ చేస్తోంది. దీనికోసమే వైఎస్ జయంతిని వేదికగా మార్చుకుంటున్నారు అనే చర్చ జరుగుతోంది. మరి షర్మిల ప్లాన్ వర్కౌట్ అవుతుందా.. నిజంగా జగన్ పార్టీ వీక్ అవుతుందా అంటే.. జగన్ అంత ఈజీగా చేతులెత్తేస్తారా అంటే.. కాలమే సమాధానం చెప్పాలి.