Chandrayaan-3: కొనసాగుతున్న కౌంట్‌డౌన్‌.. అందరికళ్లూ చంద్రయాన్-3పైనే..

భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోసుకెళ్తపూ చంద్రయాన్-3 ఇవాళ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌‌ను నింగిలోకి ప్రయోగిస్తారు. ఇది వచ్చే నెల 23 లేదా 24న చంద్రుడిని చేరుకుంటుందని శాస్త్రవేత్తల అంచనా.

  • Written By:
  • Publish Date - July 14, 2023 / 09:34 AM IST

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం మరికొన్ని గంటల్లో జరగబోతోంది. ఈ ప్రయోగం కోసం యావద్భారత దేశమే కాదు.. ప్రపంచమే ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈసారి ప్రయోగం కచ్చితంగా విజయవంతమవుతుందని సైంటిస్టులు నమ్మకంగా చెబుతుంటే, ప్రజలంతా విజయవంతం కావాలని కోరుకుంటున్నారు. ఇప్పటికే చంద్రయాన్-3కి కౌంట్‌డౌన్ మొదలైంది. శుక్రవారం మధ్యాహ్నం 02.35 గంటలకు ప్రయోగం జరగబోతుంది. ఈ నేపథ్యంలో చంద్రయాన్-3కి సంబంధించిన కొన్ని విశేషాలివి.
భారతీయుల ఆశలు, ఆకాంక్షలను మోసుకెళ్తపూ చంద్రయాన్-3 ఇవాళ నింగిలోకి దూసుకెళ్లనుంది. ఏపీలోని తిరుపతి జిల్లా శ్రీహరికోట నుండి ఎల్‌వీఎం-3 ఎం4 రాకెట్‌‌ను నింగిలోకి ప్రయోగిస్తారు. ఇది వచ్చే నెల 23 లేదా 24న చంద్రుడిని చేరుకుంటుందని శాస్త్రవేత్తల అంచనా. లేదా మరో నాలుగైదు రోజులు ఆలస్యం కావొచ్చు. ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపైకి వ్యోమనౌకను పంపిన నాలుగో దేశంగా ఇండియా నిలుస్తుంది. ఇంతకుముందు అమెరికా, రష్యా, చైనా ఈ ప్రయోగం చేశాయి. ఇండియా తొలిసారిగా 2008, అక్టోబర్ 22న తొలిసారిగా చంద్రయాన్ ప్రయోగం చేపట్టింది. ఆ తర్వాత 2019 జూలైలో చంద్రయాన్-2 ప్రయోగం చేపట్టింది. ఈ ప్రయోగాలతో ఆర్బిటార్ ద్వారా ల్యాండర్‌ను, ల్యాండర్ ద్వారా రోవర్‌ను చంద్రుడిపైకి పంపించారు. వీటి ద్వారా మొత్తం 14 రకాల పేలోడ్స్‌ను పంపించారు. అయితే, చంద్రయాన్-2 ప్రయోగం పాక్షికంగానే విజయవంతమైంది. కారణం.. చివరి రెండు నిమిషాల్లో ల్యాండర్, చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొంది. దీంతో దాన్నుంచి సంకేతాలు నిలిచిపోయాయి. చంద్రయాన్-3లో ఈ పొరపాటు జరగకుండా జాగ్రత్త తీసుకున్నారు. దీనికోసం నాలుగేళ్లుగా శాస్త్రవేత్తలు సిద్ధమయ్యారు. చంద్రయాన్-3 ద్వారా ఒకేసారి ఆర్బిటార్, ల్యాండర్, రోవర్‌ను ప్రయోగించబోతున్నారు.
మూడు మాడ్యూల్స్
చంద్రయాన్-3 ప్రయోగంలో మూడు మాడ్యూల్స్ చాలా కీలకం. అందులో ఒకటి ప్రొపల్షన్‌ మాడ్యూల్‌. రాకెట్‌ను నింగిలోకి తీసుకుపోయే మాడ్యూల్‌ ఇది. రెండవది ల్యాండర్‌ మాడ్యూల్‌. జాబిల్లిపైకి రోవర్‌ను మోసుకెళ్లి దించే మాడ్యూల్ ఇదే. దక్షిణ ధ్రువం వద్ద ఉపరితలంపై ల్యాండర్‌ దిగగానే దీన్నుంచి రోవర్‌ బయటకు వస్తుంది. ఇది పూర్తయ్యాక జరిగేది రోవర్ మాడ్యూల్. చంద్రుడిపై పరిశోధనలకు ఉపయోగపడే అసలైనది ఇదే. చంద్రుడి ఉపరితలాన్ని అధ్యయనం చేసేందుకు రోవర్‌ ఉపయోగపడుతుంది. చంద్రుడిపై ఉన్న మట్టి, మంచును, ఖనిజాలు, నీళ్లను పరిశీలించి సమాచారాన్ని భూమికి రోవర్ చేరవేస్తుంది.
శక్తివంతమైన రాకెట్
చంద్రయాన్-3 ప్రయోగానికి మొత్తం రూ.615 కోట్ల వ్యయం అయింది. దీని కోసం అత్యంత శక్తివంతమైన ఎల్వీఎం3-ఎం4 రాకెట్‌ను ప్రయోగిస్తున్నారు. ప్రయోగ సమయంలో రాకెట్‌ బరువు 640 టన్నులు, ప్రపోల్షన్‌ మాడ్యూల్‌ బరువు 2,148 కేజీలు, ల్యాండర్‌ బరువు 1752 కేజీలు, రోవర్ బరువు 26 కిలోలు. దాదాపు 120 ప్రైవేట్‌ సంస్థలు ఈ ప్రయోగంలో పాలుపంచుకున్నాయి. గతంలోలాగా పొరపాట్లు జరగకుండా చంద్రుడిపై ల్యాండర్‌ను సురక్షితంగా దించడానికి అనువైన పరికరాలను ఇస్రో సిద్ధం చేసింది. గంటకు 6,058 కి.మీ. వేగంతో ల్యాండర్‌ చంద్రుడిపైకి దిగుతుంది. ల్యాండర్‌లో అమర్చిన నాలుగు బుల్లి రాకెట్లు ఈ వేగాన్ని నియంత్రిస్తాయి. సెకన్‌కు 2 మైళ్ల వేగంతో ల్యాండర్‌ హెలికాప్టర్‌లా చంద్రుడిపై దిగుతుంది. ఆ తర్వాత అందులోంచి రోవర్‌ బయటకు వస్తుంది. ఈ రోవర్ చంద్రుడిపై తిరుగుతూ 14 రోజుల పాటు పరిశోధనలు చేస్తుంది. చంద్రుడిపై పరిశోధనలకుగాను ల్యాండర్, రోవర్‌లో ఆధునిక పరికరాలు అమర్చారు. చంద్రుడిపై ఉష్ణ లక్షణాలను, భూకంపతను, వాతావరణాన్ని కొలవడానికి, ఉపరితల మూలకం గురించి తెలుసుకోవడానికి అనువుగా ల్యాండర్, రోవర్‌లను తీర్చిదిద్దారు. రోవర్‌కు అమర్చిన అనేక కెమెరాల నుంచి వచ్చే చిత్రాల సాయంతో అక్కడి విశేషాల్ని మరింత దగ్గరగా, క్షుణ్ణంగా తెలుసుకునే వీలుంటుంది.
చంద్రుడిని చేరేందుకు 40 రోజులు
శ్రీహరి కోట స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం మధ్యాహ్నం నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-3 చంద్రుడి దగ్గరకు చేరడానికి 40 రోజులు సమయం పడుతుంది. చంద్రయాన్-2 ప్రయోగానికి 48 రోజులు పట్టింది. అయితే, ఇది విజయవంతం కాలేదు. చంద్రయాన్-3 రాకెట్‌లోని పరికరాలు బరువుగా ఉండటం, రాకెట్ బరువు కూడా ఎక్కువగా ఉండటంతోపాటు తక్కువ ఇంధనంతోనే ప్రయోగించడం వంటి కారణాల వల్ల రాకెట్ చంద్రుడిని చేరేందుకు ఇంత సమయం పడుతుంది. భూమికి 3.84 లక్షల కిలోమీటర్ల దూరంలో చంద్రుడు ఉన్నాడు. ఈ నెల 14న ప్రయోగించే ఉపగ్రహం ఆగష్టు 23 లేదా 24న చంద్రుడిపైకి చేరుకుంటుంది. అన్ని పరిస్థితులు అనుకూలిస్తేనే ఇది జరుగుతుంది. లేదంటే కాస్త ఆలస్యం కావొచ్చు. అనుకున్న సమయంలో ల్యాండింగ్ సాధ్యం కాకుంటే.. మరికొద్ది రోజులు ఎదురు చూసి, సెప్టెంబర్‌లో ల్యాండ్ అయ్యేలా చేస్తామని పరిశోధకులు అంటున్నారు.
వ్యోమగాముల్ని కూడా పంపేలా..
చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతమైతే భవిష్యత్తులో ఇండియా నుంచి వ్యోమగాముల్ని కూడా చంద్రుడిపైకి పంపిస్తారు. చంద్రయాన్ ప్రయోగం ద్వారా అక్కడి జల వనరులు, ఖనిజాలు, ఇంధన నిల్వలు వంటి వాటి గురించి తెలిసే అవకాశం ఉంది. ఈ ప్రయోగం ద్వారా చంద్రుడి ఉపరితలంపై అంతరిక్ష నౌకను దింపిన నాలుగో దేశంగా ఇండియా నిలుస్తుంది.