Elon Musk: ట్విట్లర్లో పోస్టులు వీక్షించేందుకు పరిమితులు విధించిన మస్క్..

ట్విట్టర్ అంటే ఏమిటి అని చిన్నపిల్లవాడిని అడిగినా సోషల్ మీడియా యాప్ అని చెబుతాడు. ఇది ఎందుకు ఎలా ఉపయోగించాలో కూడా వివరించేంత పాపులారిటీ సంపాదించుకుంది ఎలాన్ మస్క్ ట్విట్టర్. గతంలో ఈ సంస్థ అధినేత సబ్ స్క్రిప్షన్, అన్ సబ్ స్క్రిప్షన్ అని రెండు రకాలుగా విభజించడం మనకు తెలిసిన విష‍యమే. దీనికి కొంత డబ్బులు చెల్లిస్తేనే ఖాతాలు గోప్యంగా ఉంటాయని.. లేకుంటే ఎవరి అకౌంట్లను ఎవరైనా చూసేందుకు, మెసేజ్ లు చేసేందుకు అవకాశం ఉంటుంది. సెలబ్రిటీలతో సామాన్యులు వ్యక్తిగతంగా చాట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే దీనికి అలవాటుపడ్డ కొందరు సబ్ స్క్రిప్షన్ చేసుకున్నారు. ఇది మన్నటి వరకూ సాగిన చర్చ. అయితే తాజాగా మరో సరికొత్త నిబంధనను తీసుకొచ్చారు మస్క్. అదే వెరిఫైడ్, అన్ వెరిఫైడ్ అని రెండు రకాల అకౌంట్లుగా మార్చారు. అసలు ఏంటి ఈ వెరిఫైడ్ , అన్ వెరిఫైడ్, దీని వల్ల ఉపయోగం ఏంటి.. ఎందుకు ఈ సరికొత్త మార్పును తీసుకువచ్చారో చూద్దాం.

ట్విట్టర్ అనేది ఒక సామాజిక మాధ్యమం. దీనిని ఉపయోగించి ఒకరి వ్యక్తిగత, వృత్తిగత విషయాలను ఎప్పటికప్పుడు సమాజానిక తెలిపేందుకు అవకాశం ఉంటుంది. దీనిని పబ్లిసిటీ కావాలనుకునే వారు చాలా చక్కగా ఉపయోగించుకుంటారు. కొన్ని వ్యాపార సంస్థలు, సినిమా సెలబ్రెటీలు అయితే రోజూ వారి ఫోటోలూ, ఈవెంట్ కి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేస్తూ ఉంటారు. వీటిని వీక్షించే వీక్షకుల సంఖ్య అతని పర్సనాలిటీ మీద, సంస్థ పాపులారిటీ బట్టి ఉంటుంది. ఇది నిన్నటి వరకూ ఉన్న ముచ్చట. దీనికి చెక్ పెడుతూ తీసుకొచ్చిన సరికొత్త ఫీచర్ పేరే వెరిఫైడ్, అన్ వెరిఫైడ్ ఆప్షన్.

రోజులో అధికశాతం మంది ట్విట్లర్ లో పోస్ట్లు పెట్టడం, ఫాలో అవ్వడం, లైక్ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇలా చేసేందుకు పరిమితులు విధిస్తూ కొత్త రూల్స్ ని తీసుకువచ్చారు. అందులో భాగంగా శనివారం రాత్రి నుంచి అందరి ట్విట్టర్ ఖాతాలు అంతరాయానికి గురైయ్యాయి. దీనిపై ఎలాన్ మస్క్ స్పందిస్తూ ట్విట్టర్ పోస్ట్ లను చూసేందుకు కొన్ని పరిమితులను విధించినట్లు చెప్పుకొచ్చారు. సబ్ స్క్రైబ్ చేసుకున్న వారిని వెరిఫైడ్ ఖాతాలుగా పరిగణించారు. వీరు రోజుకు 6వేల పోస్ట్లు చూడవచ్చు. అదే అన్ సబ్స్కైబ్ ఖాతాదారులైతే రోజుకు 600 పోస్ట్లు మాత్రమే వీక్షించేందుకు అవకాశం ఉంటుంది. కొత్తగా ట్విట్టర్ ఉపయోగిస్తున్న వారికి రోజుకు 300 పోస్టులు మాత్రమే చూసేందుకు వెసులుబాటు కల్పించారు. ఎందుకిలా అంతరాయం కలిగింది, ఇలాంటి రూల్స్ తీసుకురావడానికి కారణాలను చెప్పుకొచ్చారు ఎలాన్ మస్క్. ‘డేటా స్క్రాపింగ్, సిస్టమ్ మానిప్యూలేషన్ల సమస్యలను పరిష్కరించే తరుణంలో ఇలా అంతరాయానికి గురైనట్లు పేర్కొన్నారు. అలాగే సామాజిక మాధ్యమాల్లో ఎక్కువ కాలం గడుపుతున్నారు. దీని నుంచి బయటపడాల్సిన అవసరం ఉంది. ఇలా బానిసయ్యే అవకాశం నుంచి యూజర్లను బయటపడేయాలి. అందుకే నేను ప్రపంచానికి మంచి చేస్తున్నాను’ అని బదులిచ్చారు.

రానున్న రోజుల్లో పోస్టులు వీక్షించే పరిమితిని పెంచుతామని వెల్లడించారు. వెరిఫైడ్ అకౌంట్లకు 6వేల పోస్టులు, అన్ వెరిఫైడ్ ఖాతాలకు 800 పోస్టులు, కొత్తగా లాగిన్ అయిన వారికి 400 పోస్టులు ఒక రోజులో వీక్షిచవచ్చని పేర్కొన్నారు.

T.V.SRIKAR