Daughter’s Murder: మోజులో కన్నప్రేమను మరిచి.. ఛీఛీ.. ఈమెను తల్లి అంటారా ?

ప్రియుడి మోజులో పడి కన్న ప్రేమను మరిచిందో కసాయి తల్లి. తన సుఖం కోసం.. ముక్కుపచ్చలారని చిన్నారిని చిదిమేసింది. అమ్మతనానికే మచ్చతెచ్చే ఈ ఘటన.. హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. నగర శివారులోని కుషాయిగూడలో రమేష్‌ కళ్యాణి.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కొన్నేళ్లు వీరి సంసారం సాఫీగా సాగినా.. ఆ తర్వాత విభేదాలు వచ్చాయ్. దీంతో రెండేళ్ల కింద ఈ ఇద్దరు విడిపోయారు. అప్పటి నుంచి పాపతో కలిసి వేరుగా ఉంటూ.. కూరగాయలు విక్రయిస్తూ జీవనం సాగిస్తోంది.

  • Written By:
  • Publish Date - July 12, 2023 / 02:03 PM IST

జనగామ జిల్లాలోని తన స్వస్థలానికి ఓ వేడుక కోసం కూతురితో వెళ్లిన కల్యాణికి.. బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన నవీన్ కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఇద్దరూ బంధువులే కావడంతో తరచూ కలుస్తుండేవారు. అడపాదడపా హైదరాబాద్‌కు వస్తూ.. కళ్యాణిని ఆమె ఇంట్లోనే కలవడం ప్రారంభించాడు నవీన్. ఇలా ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. చాలాకాలంగా వీరిద్దరూ ఇలా ఈ బంధాన్ని సాగిస్తున్నారు. ప్రియుడు నవీన్‌తో జీవితాన్ని పంచుకోవాలని భావించిన కళ్యాణి.. పెళ్లి చేసుకోవాలని అడిగింది. ఇప్పటికే కూతురు ఉన్న ఆమెను పెళ్లాడేందుకు ప్రియుడు నిరాకరించాడు.

దీంతో కూతురు అడ్డు తొలగించుకోవాలని భావించింది కసాయితల్లి. నిద్రలో వున్న కూతురి ముఖంపై దిండు అదిమిపట్టి ఊపిరాడకుండా చేసి అతి దారుణంగా ప్రాణాలు తీసింది. అనారోగ్యంతోనే కూతురు చనిపోయింందని నమ్మించే ప్రయత్నం చేసింది. ఐతే పాప మరణంపై అనుమానం వచ్చిన రమేష్‌.. పోలీసులను ఆశ్రయించాడు. కల్యాణి మీద ఫిర్యాదు చేశాడు. పోస్టుమార్టం నివేదికలో బాలిక ఊపిరాడక చనిపోయిందని తేలింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కళ్యాణిని తమదైన శైలిలో విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. కూతురి ప్రాణాలు తీసింది తానేనని అంగీకరించింది. ప్రియుడి కోసమే ఈ దారుణానికి పాల్పడినట్లు ఒప్పుకుంది. ఇక ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు పోలీసులు. ఈ ఘటనతో జనాలంతా ఒక్కసారి ఉలిక్కిపడ్డారు. అడ్డగోలు సంబంధాలు, అర్థంలేని బంధాలతో.. ఓ నిండు ప్రాణం తీస్తారా.. ఈమే ఒక తల్లేనా అని ఫైర్ అవుతున్నారు.