Mother Murder: తల్లిని చంపి సూట్‌కేస్‌లో ప్యాక్‌ చేసిన కూతురు

ప్రియురాలిని ముక్కలు చేసి చెత్తకుండీల్లో పడేస్తాడొకడు.. ప్రేమించిన అమ్మాయిని ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికిస్తాడు ఇంకొకడు.. బంధాలు, ఆప్యాయతలు.. మానవత్వం అంటే అక్షరాలకే పరిమితం అవుతుందా అనే అనుమానాలు కలుగుతున్న వేళ.. బెంగళూరులో మరో దారుణమైన ఘటన చోటు చేసుకుంది.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 05:56 PM IST

తొమ్మిది నెలలు మోసి.. ప్రాణం పోసిన కన్నతల్లి ప్రాణం తీసిందో కిరాతపు కూతురు. చంపేసిన తర్వాత.. తల్లి శవాన్ని సూట్‌కేసులో ఉంచి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సెనాలీ సేన్ అనే మహిళ.. పోలీస్‌స్టేషన్‌కు సూట్‌కేస్‌ తీసుకువచ్చింది. దాన్ని ఓపెన్ చేసి.. అందులో ఉన్న తన తల్లి శవాన్ని వాళ్లకు చూపించింది. పోలీసులు అడగక ముందే.. తానే తన తల్లిని చంపేశానని చెప్పేసింది.

సూట్‌కేసులో శవాన్ని చూసిన పోలీసులకు.. మైండ్‌బ్లాంక్ అయింది. ఈ కేసులో సెనాలీ చెప్పిన విషయాలు పోలీసులను ఆశ్చర్యానికి గురి చేశాయ్. కోల్‌కతాకు చెందిన సెనాలీ కుటుంబం.. దాదాపు ఆరేళ్లుగా ఒకే ఫ్లాట్‌లో ఉంటోంది. సెనాలీకి ఒక కొడుకు ఉన్నాడు. అదే ఫ్లాట్‌లో సెనాలీ తన అత్త, కొడుకుతో కలిసి నివసించింది. సేనాలీ అత్తతో తల్లికి ఎప్పుడూ గొడవలు జరిగేవి. ఐతే ఓ రోజు తల్లికి నిద్రమాత్రలు ఇచ్చిన సెనాలి.. ఇవి వేసుకుంటే నాన్న దగ్గరికి వెళ్తావని.. తాను జైలుకు వెళ్తానంటూ చెప్పి.. తల్లిని చంపేసింది.

తల్లికి దగ్గరుండి నిద్రమాత్రలు ఇచ్చి.. చనిపోయే వరకు పక్కనే ఉంది సెనాలి. చనిపోయిన తర్వాత డెడ్‌బాడీని సూట్‌కేస్‌లో పెట్టింది. ఆ తర్వాత స్కూటర్‌ మీద తీసుకువచ్చి.. పోలీసుల ముందు లొంగిపోయింది. ఐతే ఇంట్లో అందరు ఉన్నా.. ఈ హత్య గురించి ఎవరికీ తెలియకపోవడం హైలైట్. ఈ ఘటనతో బెంగళూరు ఉలిక్కిపడింది. తల్లిని చంపిన కూతురిని చూసి.. పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. సెనాలి మానసిక సమస్యలో బాధపడుతున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.