Vivekananda Reddy: హత్య గురించి జగన్‌కు ముందే తెలుసు.. వివేకా కేసులో లాయర్‌గా మారిన సునీత

వివేకా హత్య కేసు రకరకాల మలుపు తీసుకుంటోంది. అవినాశ్ రెడ్డి అరెస్ట్ అవుతారా లేదా అనే ప్రశ్న చుట్టే తిరగుతోంది కేసు మొత్తం.

  • Written By:
  • Publish Date - June 13, 2023 / 04:26 PM IST

ఐతే ఎంపీ అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘ విచారణ జరిగింది. తెలంగాణ హైకోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ.. మాజీ మంత్రి వివేకా కూతురు సునీతా సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారణ సందర్భంగా సునీత లాయర్ అవతారం ఎత్తారు. తానే స్వయంగా వాదనలు వినిపించారు. పలు కీలక అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, అనేక అంశాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదన్న సునీత.. ఇదే కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు.

సీబీఐ దర్యాప్తునకు అవినాష్‌రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని.. ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా విచారణకు హాజరుకాలేదని సుప్రీం దృష్టికి తీసుకువచ్చారు సునీత. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపారని.. అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వెళ్లినా ఎంపీ మద్దతుదారులు అడ్డుకున్నారని.. సాక్షులను ఎంపీ అదే పనిగా బెదిరిస్తూ.. ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.

అవినాష్‌కు ఏపీ ప్రభుత్వ యంత్రాంగం సహకరిస్తుందన్న సునీత.. సీబీఐ అధికారులపై అవినాష్‌ తప్పుడు ఫిర్యాదులు చేశారని ఆరోపించారు. వివేకా హత్య గురించి సీఎం జగన్‌కు ముందే తెలిసిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు సునీత. ఇక అటు సునీత వాదనల తర్వాత తదుపరి విచారణను ఈనెల 19కి వాయిదా వేసింది సుప్రీంకోర్టు.