Ravindar Chandrasekaran: రూ.16 కోట్ల మోసం.. తమిళ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్ అరెస్ట్..

కొంతకాలం క్రితం.. సాలిడ్ వేస్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ పేరుతో, నకిలీ పత్రాలు సృష్టించి చంద్రశేఖర్ మోసానికి పాల్పడ్డాడు. తను చెప్పినట్లు పెట్టుబడులు పెడితే, భారీ లాభాలు వస్తాయని నమ్మించి, బాధితుల నుంచి రూ.16 కోట్లు వసూలు చేశాడు.

  • Written By:
  • Updated On - September 7, 2023 / 09:10 PM IST

Ravindar Chandrasekaran: తమిళ సినీ నిర్మాత రవీందర్ చంద్రశేఖరన్‌ను పోలీసులు గురువారం అరెస్టు చేశారు. పెట్టుబడుల పేరుతో మోసం చేసినందుకుగాను తమిళనాడు పోలీసులు రవీందర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కొంతకాలం క్రితం.. సాలిడ్ వేస్ట్‌లో ఇన్వెస్ట్‌మెంట్ టు ఎనర్జీ ప్రాజెక్ట్ పేరుతో, నకిలీ పత్రాలు సృష్టించి చంద్రశేఖర్ మోసానికి పాల్పడ్డాడు. తను చెప్పినట్లు పెట్టుబడులు పెడితే, భారీ లాభాలు వస్తాయని నమ్మించి, బాధితుల నుంచి రూ.16 కోట్లు వసూలు చేశాడు.

అయితే, ఈ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. పెట్టుబడిదారులు తమ డబ్బులు తిరిగి ఇవ్వాలి అని అడిగినా స్పందించలేదు. దీంతో తాము మోసపోయామని గుర్తించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు రవీందర్ చంద్రశేఖరన్‌ను అరెస్టు చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా అతడిపై చీటింగ్ కేసు నమోదైంది. అమెరికాకు చెందిన విజయ్ అనే భారతీయ యువకుడిని నమ్మించి, సినిమా తీసేందుకు రూ.15 లక్షలు వసూలు చేశాడు. అయితే, సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో బాధితుడు విజయ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇలా సినిమాల పేరుతో కూడా పలువురి దగ్గరినుంచి అక్రమంగా వసూలు చేసినట్లు తెలుస్తోంది.

లిబ్రా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రవీందర్ సినిమాలు నిర్మిస్తున్నాడు. కాగా, గత ఏడాది అతడిని మహాలక్ష్మి అనే సీరియల్ నటి వివాహం చేసుకోవడంతో అతడి పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. ఇద్దరి జంటపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. దీనిద్వారా వచ్చిన ఫేమ్‌ వినియోగించుకుంటూ, ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నాడన్న ఆరోపణలున్నాయి.