Rajasthan Kota Coaching Centre : మిస్టీరియస్ మరణాల ‘కోటా’.. గాల్లో దీపాల్లా విద్యార్థుల ప్రాణాలు

రాజస్థాన్ లోని ‘కోటా’లో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం.. వరుస మరణాల మర్మం ఏంటి..? ఈనేపథ్యంలో కోచింగ్ కోసం కోటాకు వెళ్తున్న స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకునేందుకు దారితీస్తున్న కారణాలేంటి ?

వరుస మరణాల మర్మం ఏంటి..?

రాజస్థాన్ లోని కోటాలో విద్యార్థుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. నీట్, జేఈఈ వంటి పరీక్షలకు కోచింగ్ కోసం అక్కడికి వెళ్తున్న స్టూడెంట్స్ బలవన్మరణాలకు పాల్పడుతుండటం కలవరం గొలుపుతోంది. దీంతో అక్కడికి కోచింగ్ కు పిల్లల్ని పంపాలంటే పేరెంట్స్ ఎంతో భయపడుతున్నారు. ఈనేపథ్యంలో కోచింగ్ కోసం కోటాకు వెళ్తున్న స్టూడెంట్స్ సూసైడ్స్ చేసుకునేందుకు దారితీస్తున్న కారణాలేంటి ? అనే ఆన్సర్ దొరకని ప్రశ్నగా మిగిలిపోయింది. దీనిపై అంతటా హాట్ డిస్కషన్ నడుస్తోంది. అఫైర్లు, తల్లిదండ్రుల ఒత్తిడి వల్లే విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఇటీవల రాజస్థాన్ మంత్రి శాంతి కుమార్‌ ధరీవాల్‌ వివాదాస్పద కామెంట్స్ చేశారు. అయితే ఆ కామెంట్స్ లో నిజం ఎంత ఉంది ? అనేది అక్కడి పోలీసుల దర్యాప్తు రిపోర్టులను జల్లెడపడితేనే తెలుస్తుంది. గత ఎనిమిది నెలల వ్యవధిలో ఇప్పటివరకు 25 మంది విద్యార్థులు కోటాలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వారందరి సూసైడ్స్ పై అక్కడి పోలీసులు జరిపిన విచారణ నివేదికలను సమీకరించి, ఒక విశ్లేషణ చేస్తే నిజం నిగ్గు తేలుతుంది. ఈ దిశగా చొరవ చూపాల్సిన బాధ్యత రాజస్థాన్ ప్రభుత్వంపైనే ఉంటుంది. కోటాలోని కోచింగ్ సెంటర్స్ లేదా కోటాలో కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ కలిసికట్టుగా ఆ రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తెస్తే దీనిపై విచారణ జరిగే ఛాన్స్ ఉంటుంది. లేదంటే మనం రానున్న రోజుల్లోనూ రాజస్థాన్ లోని కోటాలో మిస్టీరియస్ గా మరిన్ని సూసైడ్స్ జరిగాయనే వార్తలను వినాల్సి రావచ్చు.

ఆ ఫ్యాన్లపై ఫోకస్..

వాస్తవానికి విద్యార్థుల ఆత్మహత్యలను నివారించేందుకు గతంలో రాజస్థాన్ సర్కార్ ఓ కమిటీని నియమించింది. ఎన్ని భద్రతా చర్యలు తీసుకున్నా.. విద్యార్థులు మానసిక ఒత్తిడి, ఇతర కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆ కమిటీ తెలిపింది. అయితే మానసిక ఒత్తిడిని జయించేలా కోటాలో కోచింగ్ తీసుకునే స్టూడెంట్స్ కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించాలనే దానిపై మాత్రం నిర్ణయం తీసుకోలేకపోయారు. ఇక విద్యార్థులు ఎక్కువగా ఫ్యాన్లకు ఉరివేసుకుని ఆత్మహత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇందులో భాగంగానే ఇటీవలే కోటాలోని అన్ని హాస్టళ్లు, పెయింగ్‌ గెస్ట్‌ వసతుల్లో స్ప్రింగ్‌ లోడెడ్‌ ఫ్యాన్లను అధికారులు ఏర్పాటు చేశారు. లోడ్‌ను గుర్తించిన వెంటనే అన్‌ కాయిల్‌ అయ్యేలా ఈ ఫ్యాన్లను తయారు చేశారు. లోడ్‌ అవ్వగానే సీలింగ్‌ నుంచి ఫ్యాన్‌ కిందకు జారిపోతుంది. ఈ చర్యలతో కాస్తమేర ఆత్మహత్యలను తగ్గించొచ్చని అధికారులు భావిస్తున్నారు. దీంతోపాటు రెండు నెలలపాటు కోటాలోని శిక్షణా కేంద్రాల్లో విద్యార్థులకు ఎలాంటి టెస్టులు నిర్వహించకూడదని ఆదేశాలు ఇచ్చారు. మానసిక ఒత్తిడిని అధిగమించేందుకు సెప్టెంబరు, అక్టోబరులో విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించాలని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులకు జిల్లా అధికారులు సూచించారు.

నీట్, జేఈఈకి ఎంపిక కాకపోవడం వల్లే..

రాజస్థాన్‌ పోలీస్‌ డేటా ప్రకారం.. ఈ ఏడాది ఇప్పటివరకు కోటాలో 25 మంది విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. గతంలోకి వెళితే

  • 2022లో 15 మంది
  • 2019లో 18 మంది
  • 2018లో 20 మంది
  • 2017లో ఏడుగురు
  • 2016లో 17 మంది
  • 2015లో 18 మంది
    విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అయితే, కరోనా కారణంగా కోచింగ్ సెంటర్లు మూతపడడంతో 2020, 2021 ఏడాదిల్లో కోటాలో ఒక్క విద్యార్థి కూడా సూసైడ్ చేసుకోలేదు. నీట్, జేఈఈ పరీక్షల కోసం ఏళ్ల తరబడి ప్రిపరేషన్‌ చేసి, కోచింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో లక్షల్లో ఫీజులు కట్టినా.. ఎంపిక కాకపోవడం వల్లే చాలా మంది విద్యార్థులు ఆత్మహత్యల దిశగా అడుగులు వేస్తున్నారని పరిశీలకులు అంటున్నారు.