ATM Baba: ఇదేం స్టార్టప్‌రా బాబు.. ఏటీఏం ఎలా పగలగొట్టాలో యువతకు శిక్షణ ఇస్తారట!

సాధారణంగా స్టార్టప్‌లు పెట్టే వారి ఆలోచనలు అందరితో శభాష్ అనిపించుకునేలా ఉంటాయి. సొసైటీకి ఏదో ఒక రకంగా ఉపయోగపడేలా ఉంటాయి. అయితే, ఉత్తర ప్రదేశ్‌లోని ఒక స్టార్టప్ మాత్రం పోలీసుల్నే కాదు.. మొత్తం సమాజాన్నే షాక్‌కు గురయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఆ స్టార్టప్‌ కాన్సెప్ట్ ఏంటంటే..

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 07:51 PM IST

ATM Baba: ఇప్పుడంతా స్టార్టప్‌ల ట్రెండ్ నడుస్తోంది. యువతరం తమదగ్గర ఉన్న కొత్త వ్యాపార ఆలోచనల్ని స్టార్టప్‌ల ద్వారా అమలు చేస్తుంటారు. వివిధ మార్గాల్లో నిధులు సేకరించి, ఔత్సాహికులైన వారికి శిక్షణ ఇచ్చి, వ్యాపారాన్ని నిర్వహిస్తుంటారు. సాధారణంగా స్టార్టప్‌లు పెట్టే వారి ఆలోచనలు అందరితో శభాష్ అనిపించుకునేలా ఉంటాయి. సొసైటీకి ఏదో ఒక రకంగా ఉపయోగపడేలా ఉంటాయి. అయితే, ఉత్తర ప్రదేశ్‌లోని ఒక స్టార్టప్ మాత్రం పోలీసుల్నే కాదు.. మొత్తం సమాజాన్నే షాక్‌కు గురయ్యేలా చేస్తోంది. ఇంతకీ ఆ స్టార్టప్‌ కాన్సెప్ట్ ఏంటంటే.. ఏటీఎంలు పగలగొట్టి, డబ్బులు దొంగిలించడం.
స్టార్టప్‌లు యువతరానికి ఒక వరం. విభిన్న ఆలోచనలు ఉండి, సరైన నిధులు లేకపోయినా ప్రభుత్వ సహకారంతోనో, ఇన్వెస్టర్స్ సాయంతోనే స్టార్టప్‌లు పెడుతుంటారు. వీటి ద్వారా ఎంతో మందికి ఉపాధి దొరుకుతోంది. అందుకే ప్రభుత్వం వీటిని ప్రోత్సహిస్తోంది. దీని ఉద్దేశం సమాజానికి మేలు జరగాలనే. కానీ, బిహార్‌లోని చప్రాకు చెందిన సుధీర్ మిశ్రా మాత్రం తన స్టార్టప్ ద్వారా యువతను తప్పుడు మార్గంలో నడిపిస్తున్నాడు. ఏటీఎం బాబాగా పేరు పొందిన సుధీర్ నిరుద్యోగ యువతకు ఏటీఎంలు ఎలా దొంగిలించాలో శిక్షణ ఇస్తున్నాడు. అది కూడా 15 నిమిషాల్లోనే ఏటీఎంను పగులగొట్టి, అందులోని డబ్బును ఎలా దొంగిలించాలో నేర్పిస్తున్నాడు.
పక్కా ప్రొఫెషనల్ ట్రైనింగ్
ఇతర టెక్నికల్ డిపార్ట్‌మెంట్లలో ఎలాంటి ప్రొఫెషనల్ ట్రైనింగ్ ఉంటుందో సుధీర్ మిశ్రా కూడా ఏటీఎం కొల్లగొట్టేందుకు అలాంటి ట్రైనింగే ఇస్తున్నాడు. ఉత్తర ప్రదేశ్ నుంచి నిరుద్యోగ యువతను తీసుకొస్తాడు. వారికి దాదాపు మూడు నెలలపాటు దీనిలో క్రాష్ కోర్స్ ఉంటుంది. ఇందులో ప్రాక్టికల్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. సిబ్బంది క్లాసులు కూడా చెబుతారు. ఏటీఎంను 15 నిమిషాల్లోనే ఎలా పగులగొట్టి, డబ్బులు ఎత్తుకెళ్లాలో నేర్పిస్తారు. లైవ్ డెమో కూడా చూపిస్తారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా, వేలిముద్రలు వంటి ఆధారాలు దొరక్కుండా ఎలా మేనేజ్ చేయాలో కూడా నేర్పుతారు. ఇందుకోసం ప్రత్యేక కెమికల్స్ వాడేలా శిక్షణ కూడా ఇస్తారు. ఇక్కడ అన్ని టెస్టులు, శిక్షణ పూర్తైన వారిని ఫీల్డులోకి పంపిస్తారు. అలా చాలా మంది యువకులే శిక్షణ పూర్తి చేసుకుని బయటకు వెళ్లినట్లు తెలుస్తోంది.
పోలీసులకు చిక్కిన ముఠా
ఇటీవల ఉత్తర ప్రదేశ్‌లో నలుగురు యువకులతో కూడిన ఒక ముఠా ఏటీఎంను ఇలాగే 15 నిమిషాల్లో దొంగతనం చేసింది. తర్వాత వీరిని పోలీసులు పట్టుకుని విచారించారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఇంత పర్ఫెక్టుగా దొంగతనం ఎలా చేశారా అని ఆరాతీస్తే ఏటీఎం బాబా అలియాస్ సుధీర్ మిశ్రా వ్యవహారం బయటపడింది. ప్రస్తుతం అతడి గురించి పోలీసులు వెతుకుతున్నారు. నిందితుల దగ్గరి నుంచి రూ.9 లక్షల వరకు నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం బాబాను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. సుధీర్ మిశ్రా తనను తాను దైవదూతగా కూడా చెప్పుకొంటాడట. మొత్తానికి ఏటీఎంను ఎలా కొల్లగొట్టాలో శిక్షణ ఇచ్చే ఒక స్టార్టప్‌ ఉందీ అంటేనే అందరూ షాకవుతున్నారు.