Blood In Cocktail: ఇదెక్కడి దారుణం.. రక్తంతో డ్రింక్.. జపాన్‌లో సర్వ్ చేసిన వెయిట్రెస్!

జపాన్‌లో రక్తంతో తయారైన ఒక డ్రింక్ అందించిందో వెయిట్రెస్. ఇటీవల ఈ షాకింగ్ ఘటన జరిగింది. జపాన్, హొక్కైడో ప్రాంతం, సాప్పొరో పట్టణంలో మోండాజీ అనే కేఫ్ ఉంది. ఇక్కడ ఒక వెయిట్రెస్ కాక్‌టెయిల్ డ్రింక్ తయారు చేసి అందించాలి. కానీ, ఆమె తన రక్తం కలిసిన డ్రింక్ అందించింది.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 06:51 PM IST

Blood In Cocktail: రక్తంతో తయారైన డ్రింక్స్ తాగడం సినిమాల్లోనే చూసుంటారు. నిజ జీవితంలో అలాంటివి అసాధ్యం అనుకుంటారు. కానీ, జపాన్‌లో రక్తంతో తయారైన ఒక డ్రింక్ అందించిందో వెయిట్రెస్. ఇటీవల ఈ షాకింగ్ ఘటన జరిగింది. జపాన్, హొక్కైడో ప్రాంతం, సాప్పొరో పట్టణంలో మోండాజీ అనే కేఫ్ ఉంది.

ఇక్కడ ఒక వెయిట్రెస్ కాక్‌టెయిల్ డ్రింక్ తయారు చేసి అందించాలి. కానీ, ఆమె తన రక్తం కలిసిన డ్రింక్ అందించింది. ఈ కేఫ్‌కు వచ్చిన ఒక కస్టమర్ ఒరికాకు (ఒరిజినల్ కాక్‌టెయిల్) డ్రింక్ ఆర్డర్ చేశాడు. దీన్ని మిక్స్‌డ్ ఫ్రూట్స్, కలర్ ఫుల్ సిరప్స్‌తో తయారు చేస్తారు. అయితే, అలా తయారైన డ్రింకులో ఒక వెయిట్రెస్ తన రక్తం కలిపింది. ఈ రక్తం కలిపిన డ్రింకును ఆమె కస్టమర్‌కు అందించింది. ఈ ఘటన జరిగేందుకు ఒక కారణం ఉంది. ఈ కేఫ్‌ ‘ప్రాబ్లం చైల్డ్ డార్క్ థీమ్’తో నడుస్తోంది. అంటే పూర్తి డార్క్ థీమ్‪లో, చీకట్లో డ్రింక్ సర్వ్ చేస్తారు. పైగా సర్వ్ చేసే వెయిటర్లు, వెయిట్రెస్‌లు కూడా ఎవరికీ ముఖం కనిపించకుండా, దెయ్యంలాగా మేకప్ చేసుకోవాలి. దీంతో గుర్తు తెలియని ఒక వెయిట్రెస్ ఈ పని చేసింది. కానీ, తర్వాత విచారణ ద్వారా ఆమెను గుర్తించారు.

వెంటనే ఆమెను ఉద్యోగంలోంచి తొలగించినట్లు యాజమాన్యం ప్రకటించింది. అయితే, కస్టమర్ కోరిక మేరకే కాక్‌టెయిల్‌లో ఆమె రక్తం కలిపి ఇచ్చినట్లు చెప్పింది. ఏదేమైనా ఇలా డ్రింకులో రక్తం కలపడం నీచమైన చర్య అని అక్కడి వాళ్లు అంటున్నారు. ఇది తీవ్రవాదంతో సమానం అని కేఫ్ యాజమాన్యం ప్రకటించింది. రక్తం కలిసిన డ్రింక్స్ తాగడం వల్ల ప్రాణాంతక జబ్బుల బారిన పడే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. హెచ్ఐవీ, హెపటైటిస్, సైఫిల్స్ వంటివి సోకే ప్రమాదం ఉందంటున్నారు. ఈ ఘటన తర్వాత కేఫ్‌ను యాజమాన్యం ఒక రోజుపాటు మూసేసింది. రక్తం కలిసిన గ్లాసుల్ని స్టెరిలైజ్ చేస్తున్నట్లు చెప్పారు. అలాగే ఆమె సర్వ్ చేసిన డ్రింక్స్ అన్నింటినీ మారుస్తున్నట్లు వెల్లడించారు.

కస్టమర్లకు ఎలాంటి ప్రమాదం లేకుండా తిరిగి డ్రింక్స్ సర్వ్ చేసేందుకు ప్రయత్నిస్తామని, ఈ విషయంలో అందరూ సహకరించాలని యాజమాన్యం కోరింది. ఈ కేఫ్ గత నెలలోనే ప్రారంభమైంది. 25 డాలర్లకు అడిగినన్ని డ్రింక్స్ అందిస్తామని ప్రకటించింది. దీంతో చాలా మంది కస్టమర్లు ఈ కేఫ్‌కు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే తాజా ఘటన జరిగింది.