Wife Kills Husband: తండ్రితో కలిసి భర్తను లేపేసింది.. గుండెపోటు డ్రామా ఆడి దొరికిపోయింది!

అల్లూరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఫైనాన్స్‌ వ్యాపారిపై అతడి భార్య ఘోరానికి పాల్పడింది. తన తండ్రితో కలిసి.. భర్తను హతం చేసింది. అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం నేరెడువలలో ఈ ఘటన జరిగింది.

  • Written By:
  • Publish Date - April 28, 2023 / 05:29 PM IST

Wife Kills Husband: అనుబంధాలకు విలువ లేకుండా పోతోంది. ఆప్యాయతలు అడ్రస్ లేకుండా పోతున్నాయి. దిక్కుమాలిన సంబంధాలు, క్షణికావేశాలు.. ప్రాణాలు తీసే వరకు తీసుకెళ్తున్నాయి. వావివరుసలు మరిచిపోయి కొందరు ప్రాణాలు తీస్తుంటే.. మరికొందరు అక్రమ సంబంధాలతో బతుకులు నాశనం చేసుకుంటున్నారు. ఇక డబ్బుల కోసం భర్తను, కన్న పేగును కాటేస్తున్న ప్రబుద్ధులు ఇంకొందరు.

అల్లూరి జిల్లాలో ఇలాంటి ఘటనే జరిగింది. ఓ ఫైనాన్స్‌ వ్యాపారిపై అతడి భార్య ఘోరానికి పాల్పడింది. తన తండ్రితో కలిసి.. భర్తను హతం చేసింది. అల్లూరు జిల్లా జి మాడుగుల మండలం నేరెడువలలో ఈ ఘటన జరిగింది. ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న విజయ్‌… 2014లో ప్రీతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరికి ఓ పాప కూడా ఉంది. ఫైనాన్స్‌ వ్యాపారంలో భార్యాభర్తలకు తరుచూ గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో విజయ్‌ను లేపేయాలని.. తన తండ్రితో కలిసి ప్రీతి ప్లాన్ చేసింది. ఈ నెల 17న విజయ్‌కు మద్యం పోశారు. మత్తులో ఉన్న అతని మొహంపై దిండుతో అదిమి హత్య చేశారు. తెల్లవారుజామున మృతదేహాన్ని కారులో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి.. గుండెపోటుతో కోమాలోకి వెళ్లిపోయాడని డ్రామా మొదలుపెట్టారు.

ఐతే నిజం ఎక్కువ రోజులు దాగదు కదా! కాల్ డేటా, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా.. పోలీసులు రంగంలోకి దిగారు. కూపీ లాగితే అసలు విషయం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రీతి సహా ఏడుగురు నిందితులను గుర్తించారు. ప్రీతి తండ్రి శంకర్‌రావును అదుపులోకి తీసుకున్నారు. ప్రీతితో పాటు మరో ఐదుగురు పరారీలో ఉండగా.. వారి కోసం గాలిస్తున్నారు. భర్తను భార్య చంపాలనుకోవడం.. దానికి తండ్రి సహకరించడం.. ఈ వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. ఐతే నిజంగా ఫైనాన్స్ వ్యాపారంలో గొడవలే కారణమా.. లేదంటే ఏమైనా సంబంధాలు, ఇతర అంశాలు ఈ హత్యకు కారణమా అనే యాంగిల్‌లో పోలీసులు కూపీ లాగుతున్నారు.