Tamil Nadu: స్నేహితురాలినే చీట్ చేసిన మహిళ.. చికెన్ వండి పెట్టి.. డబ్బు, నగలతో పరార్!

కోయంబత్తూరులో రియల్‌ఎస్టేట్ బిజినెస్‌ చేసే రాజేశ్వరి, వర్షిణి ఫ్రెండ్స్‌. రీసెంట్‌గా ఓ ప్రాపర్టీ కోసం డబ్బు చెల్లించేందుకు పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో పెట్టింది రాజేశ్వరి. ఈ విషయం తెలుసుకున్న వర్షిణి ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలని ప్లాన్‌ చేసింది.

  • Written By:
  • Publish Date - May 5, 2023 / 01:01 PM IST

Tamil Nadu: స్నేహితురాలికి మత్తుమందు ఇచ్చి, ఆమె ఇంట్లోని డబ్బు, నగదుతో ఉడాయించింది ఓ కిలాడీ లేడీ. తమిళనాడు, కోయంబత్తూరులోని రామనాథపురంలో ఈ ఘటన జరిగింది. కోయంబత్తూరులో రియల్‌ఎస్టేట్ బిజినెస్‌ చేసే రాజేశ్వరి, వర్షిణి ఫ్రెండ్స్‌. రీసెంట్‌గా ఓ ప్రాపర్టీ కోసం డబ్బు చెల్లించేందుకు పెద్ద మొత్తంలో నగదు ఇంట్లో పెట్టింది రాజేశ్వరి.

ఈ విషయం తెలుసుకున్న వర్షిణి ఎలాగైనా ఆ డబ్బు కాజేయాలని ప్లాన్‌ చేసింది. ల్యాండ్‌ కొనేందుకు కస్టమర్లు వస్తున్నారంటూ తన స్నేహితులు అరుణ్‌ కుమార్‌, ప్రవీణ్‌, సురేంద్రన్‌లను పిలిచింది. వాళ్లను కస్టమర్లుగా పరిచయం చేసి రాజేశ్వరిని నమ్మించింది. ఇంట్లో భోజనం చేస్తూ మాట్లాడుకుందామని చెప్పి కోడి కూర వండి అందులో మత్తు మందు కలిపింది. వర్షిణిని పూర్తిగా నమ్మిన రాజేశ్వరి ఆ కోడి కూడా తిని స్పృహ తప్పి పడిపోయింది. దీంతో వెంటనే ఇంట్లోని రెండున్నర కోట్ల డబ్బు, వంద సవర్ల బంగారం తీసుకుని తన స్నేహితులతో కలిసి అక్కడి నుంచి ఉడాయించింది.

స్పృహలోకి వచ్చిన తరువాత చూస్తే రాజేశ్వరి ఇల్లు గుల్లయింది. దీంతో వెంటనే పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేసింది రాజేశ్వరి. వెంటనే గాలింపు చేపట్టిన పోలీసులు రాజేశ్వరి స్నేహితులు ప్రవీణ్‌, అరుణ్‌కుమార్‌, సురేంద్రన్‌లను అరెస్ట్‌ చేశారు. కానీ వర్షిణి ఆచూకీ మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆమె విదేశాలకు పారిపోయిందని వర్షిణి స్నేహితులు చెప్తున్నారు. ఈ ఘటన ఇప్పడు కోయంబత్తూరులో హాట్‌ టాపిక్‌గా మారింది.