వేణు స్వామికి మూడింది, ఊచలు లెక్కపెట్టాల్సిందేనా…?

  • Written By:
  • Publish Date - August 13, 2024 / 08:17 PM IST

ఇన్నాళ్ళు జ్యోతిష్యం పేరుతో సినీ రాజకీయ వర్గాల్లో వేలు పెడుతూ జాతకాలు చెప్పే వేణు స్వామి జైలుకి వెళ్ళే రోజులు దగ్గర పడ్డాయా…? అంటే అవుననే సమాధానం వినపడుతోంది. సినిమా ప్రముఖులు పెళ్లి చేసుకోవడం ఆలస్యం వాళ్ళు కలిసి ఉండరు, విడిపోతారు అంటూ మాట్లాడుతూ ఉంటారు వేణు స్వామి. ఈ విషయంలో ఎంత మంది వార్నింగ్ ఇచ్చినా ఆయన వైఖరిలో మాత్రం మార్పు రాలేదు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గెలుస్తుందని కామెంట్ చేసి నాలుక కొరుక్కున్నారు వేణు స్వామి. ఆ తర్వాత జాతకాలు చెప్పను అంటూ ప్రకటించారు.

రాజకీయాలకు దూరంగా ఉండే వేణు స్వామి ఇప్పుడు సినిమా వాళ్ళను మాత్రం తన జ్యోతిష్యంతో వెంటాడుతూనే ఉన్నారు. ఇటీవల శోభిత ధూళిపాళ్ళ, నాగ చైతన్య నిశ్చితార్ధం చేసుకుంటే వాళ్ళు ఇద్దరూ విడిపోయే అవకాశం ఉందని కలిసి ఉండే అవకాశం లేదంటూ కామెంట్ చేసారు. దీనిపై అక్కినేని ఫ్యాన్స్ ఫైర్ అయిపోయారు. శుభమా అని పెళ్లి చేసుకుంటే నీ జ్యోతిష్యం గోల ఏంటీ అంటూ మండిపడ్డారు. ఇక ఆయనపై కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు అవి నిజమే అనిపిస్తోంది.

తెలంగాణా మహిళా కమీషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేసింది. పరాంకుశం వేణుని వ్యక్తిగతంగా 22-08-2024 న హాజరు కావాలని సమన్లు జారీ చేసింది తెలంగాణ మహిళా కమీషన్. ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు డిజిటల్ మీడియా అసోసియేషన్ ఫిర్యాదు మేరకు ఆయనను ఈ నెల 22 న విచారణకు రావాలంటూ మహిళా కమీషన్ చైర్ పర్సన్ నేరెళ్ళ శారద ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేసారు. ఆయనపై కేసు నమోదు చేసే అవకాశం కనపడుతోంది. శోభిత… వేణు స్వామి జాతకంపై సీరియస్ అయినట్టు సమాచారం.