తెలంగాణా ఆ సినిమా బ్యాన్, రేవంత్ నిర్ణయం ఏంటీ…?

బిజెపి ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్... దర్శకత్వం వహించి నటించిన ఎమర్జెన్సీ చిత్రం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఈ సినిమాలో సిక్కులను టార్గెట్ చేసారనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాను తెలంగాణాలో బ్యాన్ చేయాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి.

  • Written By:
  • Publish Date - August 30, 2024 / 12:10 PM IST

బిజెపి ఎంపీ, బాలీవుడ్ నటి కంగనా రనౌత్… దర్శకత్వం వహించి నటించిన ఎమర్జెన్సీ చిత్రం ఇప్పుడు వివాదాస్పదం అవుతోంది. ఈ సినిమాలో సిక్కులను టార్గెట్ చేసారనే ఆరోపణలు వినిపించాయి. ఈ నేపధ్యంలో ఈ సినిమాను తెలంగాణాలో బ్యాన్ చేయాలనే డిమాండ్ లు వినపడుతున్నాయి. ఈ మేరకు మాజీ ఐపీఎస్‌ అధికారి తేజ్‌దీప్‌ కౌర్‌ మీనన్‌ నేతృత్వంలోని తెలంగాణ సిక్కు సొసైటీ ప్రతినిధి బృందం… తెలంగాణా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీతో భేటీ అయింది. తమను తీవ్రవాదులుగా చూపించే ‘ఎమర్జెన్సీ’ స్క్రీనింగ్ పై నిషేధం విధించాలని కోరింది.

ఈ సందర్భంగా షబ్బీర్ అలీ ఒక ప్రకటన విడుదల చేసారు. సిక్కు సమాజాన్ని కించపరిచే విధంగా సినిమా చిత్రీకరణ ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ 18 మంది సభ్యుల ప్రతినిధి బృందం తనను కలిసి రిప్రజెంటేషన్‌ ను సమర్పించిందని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలో సిక్కులను తీవ్రవాదులుగా, దేశ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ విధంగా తమను చూపించడం ఆక్షేపణీయమైనది సిక్కు సమాజ ప్రతిష్టను దెబ్బతీసేలా చిత్రీకరణ ఉందని సిక్కు బృందం ఆరోపించింది.

తమ ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వం అర్ధం చేసుకుని సినిమాను బ్యాన్ చేస్తుందని వారు కోరినట్టు ఆయన వివరించారు. అవసరమైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని కూడా కలుస్తామని వారు చెప్పినట్టుగా షబ్బీర్ అలీ పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి మీ ఆవేదనను అర్ధం చేసుకుంటారని తాను హామీ ఇచ్చినట్టు తెలిపారు. ఈ సినిమాలో కంగనా రనౌత్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పాత్రలో కనపడుతున్నారు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడినా సెప్టెంబర్ ఆరున ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఎమర్జెన్సీ రోజులను ఈ సినిమాలో చూపించే ప్రయత్నం జరుగుతోంది. పలు సిక్కు నేతలను ఈ సినిమాలో ఏ విధంగా చూపిస్తారు అనే దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ సినిమాను బిజెపి కావాలని తీస్తోందని కాంగ్రెస్, ఇతర ప్రతిపక్ష పార్టీల పాలిత రాష్ట్రాల్లో బ్యాన్ చేయాలని సిక్కులు డిమాండ్ చేస్తున్నారు.