టాలీవుడ్ కు దిష్టి తగిలిందా…? అసలేం జరుగుతోంది…?

  • Written By:
  • Publish Date - August 27, 2024 / 12:00 PM IST

తమ అభిమాన హీరోని ఫ్యాన్స్ ఎంతో అపురూపంగా చూసుకుంటారు. తమ హీరోకి కట్టిన ఫ్లెక్సీ చిరిగినా సరే భరించలేరు ఫ్యాన్స్. అలాంటిది ఏదైనా చిన్న దెబ్బ తగిలింది అనే వార్త వస్తే…? అమ్మో పూజలు, యాగాలు, యజ్ఞాలు అంటూ హడావుడి చేస్తారు. సినిమా హీరోని సొంత మనిషి కంటే ఎక్కువగా చూస్తూ ఉంటారు. ఈ మధ్య కాలంలో ఇది మరీ ఎక్కువ అవుతోంది అనే చెప్పాలి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇప్పుడు వరుస ప్రమాద ఘటనలు కంగారు పెట్టేస్తున్నాయి. తమ అభిమాన హీరోలకు గాయాలు కావడం ఫ్యాన్స్ కు నచ్చడం లేదు.

షూటింగ్ సమయంలో చోటు చేసుకుంటున్న ప్రమాదాలు ఇప్పుడు ఫ్యాన్స్ ని భయపెడుతున్నాయి. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఏదోక ప్రమాదం కలవరపెడుతోంది. మొన్న జూనియర్ ఎన్టీఆర్, నిన్న రవితేజ, నేడు మహేష్ బాబు… ఇలా స్టార్ హీరోలకు ప్రమాదాలు జరగడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. దీని కారణంగా సినిమా షూటింగ్ లు సైతం వాయిదా పడుతున్నాయి. ఎన్టీఆర్ కు జిమ్ చేస్తున్న సమయంలో చేతికి గాయం అయింది. దీని కారణంగా మూడు వారాల పాటు సినిమా షూటింగ్ కు ఆయన దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇక రవితేజా కూడా ప్రమాదానికి గురయ్యారు. తన 75 వ సినిమా షూటింగ్ సమయంలో రవితేజా చేతికి బలమైన గాయం అయింది. ఆ తర్వాత సర్జరీ చేసారు… ఆ ఫోటో ఒకటి బయటకు వచ్చి ఫ్యాన్స్ చేత కన్నీరు పెట్టించింది. ఇక ఇప్పుడు మహేష్ బాబుకి కూడా చిన్న ప్రమాదం జరిగింది అంటున్నారు. అందుకే రాజమౌళి సినిమా షూట్ ఆలస్యం అవుతోంది అనే ప్రచారం జరుగుతోంది. దీనితో అసలు టాలీవుడ్ కు ఏమైంది, దిష్టి తగిలిందా అంటూ ఫ్యాన్స్ కంగారు పడిపోతున్నారు. వేరే హీరోల అభిమానులు అయితే తమ అభిమాన హీరోలకు ఏం జరగవద్దని దేవుడికి దండం పెడుతున్నారు.