Payal Rajput: కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న యంగ్ హీరోయిన్.. ఈ సినిమా తర్వాత సర్జరీ..

మంగళవారం సినిమా ట్రైలర్.. థ్రిల్లర్, హర్రర్ అంశాలతో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్లలో పాయల్ పాల్గొంది. ఈ సందర్భంగా సంచలన విషయం వెల్లడించింది. తను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది.

  • Written By:
  • Updated On - October 22, 2023 / 08:07 PM IST

Payal Rajput: ఆర్ఎక్స్‌100 మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈ సినిమాలో హాట్ దృశ్యాల్లో నటించి, బోల్డ్ హీరోయిన్‌గా యూత్‌లో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అయితే, ఆ తర్వాత చేసిన సినిమాల్లో వెంకీ మామ ఒక్కటే కాస్త పేరు తెచ్చింది. మిగతా సినిమాలేవీ ప్రేక్షకుల్ని మెప్పించలేకపోయాయి. దీంతో సినిమా అవకాశాలు తగ్గాయి. ఇదే సమయంలో పాయల్‌కు మరో ఛాన్స్ ఇచ్చాడు ఆర్ఎక్స్100 దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వంలో రూపొందిన తాజా చిత్రం మంగళవారం.

ఈ సినిమాలో పాయల్ కథానాయికగా నటించింది. ఈ చిత్ర ట్రైలర్ ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా విడుదలైంది. ఈ సినిమా ట్రైలర్.. థ్రిల్లర్, హర్రర్ అంశాలతో ఆకట్టుకునేలా ఉంది. ఈ చిత్ర ప్రమోషన్లలో పాయల్ పాల్గొంది. ఈ సందర్భంగా సంచలన విషయం వెల్లడించింది. తను కిడ్నీ సమస్యతో బాధపడుతున్నట్లు తెలిపింది. త్వరలో కిడ్నీ వ్యాధికి సర్జరీ చేయించుకోబోతున్నట్లు చెప్పింది. ‘‘దర్శకుడు అజయ్ ఈ సినిమా కోసం నన్ను సంప్రదించే టైంకి నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. డాక్టర్స్ సర్జరీ చేయాల్సిందేనన్నారు. అయితే, అజయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఎలాగైనా ఈ సినిమా చేయాలని నిర్ణయించుకున్నా. సినిమా పూర్తి చేశాకే సర్జరీకి వెళ్లాలనుకున్నా. నా కెరీర్ ఎటు వెళుతోందో తెలియని పరిస్థితిలో ‘మంగళవారం’ సినిమా వచ్చింది.

‘ఆర్ఎక్స్ 100’తో అజయ్ నన్ను వెండితెరకు పరిచయం చేశారు. అది నా కెరీర్‌ను మార్చేసింది. ఇప్పుడు ‘మంగళవారం’లో అవకాశం ఇచ్చి మరోసారి నన్ను కొత్తగా పరిచయం చేస్తున్నారు. ఆయనకు ధన్యవాదాలు. ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది’’ అని పాయల్ వెల్లడించింది. ఈ సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్న పాయల్ త్వరలో సర్జరీ చేయించుకునే అవకాశం ఉంది.