Mano Bala: వాల్తేరు వీరయ్య యాక్టర్ మృతి.. ఇండస్ట్రీలో మరో విషాదం..

ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇండస్ట్రీని వరుస మరణాలు ఇబ్బంది పెడుతున్నాయ్. ఢీ ప్రోగ్రాం కొరియోగ్రాఫర్ మరణం అభిమానులను ఇంకా వెంటాడుతోంది. ఇప్పుడు మరో కమెడియన్‌ అనారోగ్యంతో చనిపోవడంతో.. ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయ్. కోలీవుడ్‌కు చెందిన ప్రముఖ హాస్య నటుడు, దర్శకుడు మనోబాల కన్నుమూశారు.

కొంతకాలంగా కాలేయ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతున్న ఆయన.. గత రెండు వారాలుగా చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మనోబాల మృతి తమిళ సినీ పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. తమిళ సినీ పరిశ్రమలో నటుడు, దర్శకుడు, నిర్మాతగా రాణించిన మనోబాల.. తెలుగు ప్రేక్షకులకు కూడా మంచి పరిచయం ఉంది. ఆయన నటించిన తమిళ సినిమాలు డబ్బింగ్‌ అవడంతో తెలుగు అభిమానులకు చేరువయ్యారు.

గజనీ సినిమాలో పాత్రతో.. తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. గజినీ, గగనం, గంగ, కథానాయకుడు..లేటెస్ట్‌గా చిరంజీవి మూవీ వాల్తేరు వీరయ్యలోనూ యాక్ట్ చేశాడు మనోబాల. జడ్జి పాత్రలో అలా కాసేపు కనిపిస్తారు. మహానటి, దేవదాసు, రాజ్‌దూత్‌లోనూ మనోబాల యాక్టింగ్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. 1970ల్లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన మనోబాల.. 1979లో భారతీరాజా దగ్గర సహాయ దర్శకుడిగా మారారు. ఆ తర్వాత దర్శకుడిగానూ 20కి పైగా చిత్రాలను తెరకెక్కించారు. మూడు చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించారు.

దాదాపు 350 సినిమాల్లో సహాయనటుడిగా మెప్పించారు. కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌ చిత్రాల్లో హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. పలు సీరియళ్లలోనూ నటించి బుల్లితెర ప్రేక్షకులకు చేరువయ్యారు. మనోబాల మరణంతో..తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కాకుండా.. టాలీవుడ్‌లోనూ విషాద చాయలు అలుముకున్నాయ్.