పవన్ బర్త్ డే, గ్రాండ్ ప్లాన్ చేసిన మెగా హీరోలు

  • Written By:
  • Publish Date - August 22, 2024 / 08:19 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్… ఇప్పుడు మూడు పాత్రల్లో పవన్ చాలా బిజీబిజీగా గడుపుతున్నారు. రాజకీయాల్లోకి రాక ముందు కేవలం సినిమాలకు మాత్రమే పరిమితం అయిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏకంగా అధికారంలో ఉన్నారు. ఒకవైపు అధికారులు, సమీక్షలు, మరో వైపు పార్టీ నేతలతో సమావేశాలు, ఇంకో వైపు సినిమాలు ఇలా తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక ఫ్యాన్స్ కోసం ఆయన సినిమాలు త్వరగా మొదలుపెడితే మంచిదనే డిమాండ్ కూడా ఉంది.

వచ్చే నెల నుంచి ఆయన సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నారని సినీ వర్గాలు అంటున్నాయి. ఇవన్నీ పక్కన పెడితే వచ్చే నెల పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు ఉంది. ఈ పుట్టిన రోజున ఫ్యాన్స్ ఏం చేస్తారు, పవన్ కళ్యాణ్ ఏమైనా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారా అనే దానిపై చాలా చర్చలే ఉన్నాయి. కాని పవన్ తో సంబంధం లేకుండా మెగా ఫ్యామిలీ కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టే ఆలోచనలో ఉంది. సాధారణంగా స్టార్ హీరోల పుట్టిన రోజులు అంటే… రక్తదానం వంటి కార్యక్రమాలను కాస్త హడావుడిగా చేస్తూ ఉంటారు.

అయితే ఇప్పుడు పవన్ పుట్టిన రోజు కోసం… రామ్ చరణ్, సాయి ధరం తేజ్, వరుణ్ తేజ్ ముగ్గురూ కాస్త డిఫరెంట్ గా ప్లాన్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవయవ దానానికి సంబంధించి పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు దానికి ప్రచారం చేయడానికి ఏపీలో పర్యటించాలని ఆ ముగ్గురూ భావిస్తున్నారు. రాయలసీమలో రామ్ చరణ్, ఉత్తరాంధ్రలో వరుణ్ తేజ్, విజయవాడలో సాయి ధరం తేజ్ పాల్గొని అవయవదానం చేయాలని నిర్ణయం తీసుకున్నారట.

దీని ద్వారా ఫ్యాన్స్ లో అవగాహన కల్పించాలని వారు భావిస్తున్నారట. పవన్ పుట్టిన రోజు వేదికగా ఈ కార్యక్రమం మొదలుపెడితే సక్సెస్ అవుతుందని వాళ్ళు భావిస్తున్నారట. దీని కోసం జనసేన నేతలు ఏర్పాట్లు చేయాలని కూడా వాళ్ళు చెప్పినట్టు సినీ, రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఇది సక్సెస్ అయి ఫ్యాన్స్ తో పాటు సామాన్యులు కూడా ముందుకు వస్తే మాత్రం సరికొత్త అధ్యాయం లిఖించినట్టే…