Prabhas Fans: ఆదిపురుష్ సినిమాపై జోకులు.. సెహ్వాగ్ మీద ప్రభాస్ ఫ్యాన్స్ ఫైర్

సినిమా విడుదలై ఇన్ని రోజులైనా 'ఆదిపురుష్'పై విమర్శలు తగ్గడం లేదు. ఓం రౌత్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాపై ఫ్యాన్స్‌తోపాటు పలువురు ప్రముఖులు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - June 25, 2023 / 04:07 PM IST

రామాయణాన్ని వక్రీకరించారని, పాత్రలను ఇష్టం వచ్చినట్లు మార్చేశారని కొందరు ఈ సినిమాను తిట్టిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా లెజెండరీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా ఈ సినిమాపై సెటైర్లు వేశాడు. రిలీజ్ అయినప్పటి నుంచి విమర్శలు ఎదుర్కొంటున్న ఆదిపురుష్ చిత్రాన్ని తాను చూసినట్లు సెహ్వాగ్ చెప్పాడు. ‘ఈ సినిమా చూసిన తర్వాతనే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో నాకు అర్థమైంది’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. ప్రభాస్ కెరీర్‌లోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ బాహుబలి ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే.

ఈ ఫ్రాంచైజీ తొలి సినిమా ‘బాహుబలి – ది బిగినింగ్’ చివర్లో ప్రభాస్‌ క్యారక్టర్‌ను కట్టప్ప వెన్నుపోటు పొడుస్తాడు. ఆ ఫ్రాంచైజీ రెండో సినిమా ‘బాహుబలి – ది కంక్లూజన్’ చిత్ర ప్రమోషన్లలో దీన్ని ఆ బృందం బాగా వాడుకుంది. ‘బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు?’ అనే క్యాప్షన్ దేశవ్యాప్తంగా తెగ ట్రెండ్ అయింది. దీనిపైనే సెహ్వాగ్ ఇప్పుడు కామెంట్ చేశాడు. ఆదిపురుష్ సినిమా ఒప్పుకున్నందుకే బాహుబలి ను కట్టప్ప చంపేశాడనే అర్థం వచ్చేలా సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ప్రభాస్ అభిమానులు ఈ విషయంలో సెహ్వాగ్‌పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా.. చాలా మంది మాత్రం ఈ డ్యాషింగ్ ఓపెనర్ కామెంట్స్‌తో ఏకీభవిస్తున్నారు.

ఈ చిత్రం ఏమాత్రం బాగలేదని, దీన్ని ప్రభాస్ ఒప్పుకోకుండా ఉండాల్సిందని కొందరు అంటున్నారు. ఏదేమైనా ఈ సినిమా విషయంలో క్రికెటర్లు కూడా జోక్యం చేసుకోవడంపై ప్రభాస్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు.