RGV: వ్యూహం’ మార్చిన రాంగోపాల్ వర్మ..!!

రెండు పార్టులుగా తీయాలనుకున్న సినిమాను ఇప్పుడు ఒక పార్ట్  కే కుదించినట్టు తెలుస్తోంది. దీన్ని వీలైనంత వరకూ పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఆర్జీవీ.

  • Written By:
  • Publish Date - August 5, 2023 / 03:16 PM IST

రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా సంచలనమే. ఏదైనా సెన్సేషన్ సృష్టించేందుకే రామ్ గోపాల్ వర్మ పనిచేస్తారని కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఎన్నికల ముందు అందుకు తగ్గట్టు సినిమాలు తీయడం ఇటీవల ఆర్జీవీకి ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు కూడా వైసీపీ అధినేత జగన్ నేపథ్యంలో రెండు సినిమాలు తీసేందుకు చాలా రోజుల కిందటే ప్లాన్ చేశారు. అందులో ఒక దానికి సంబంధించిన టీజర్ కూడా రిలీజ్ చేశారు. రెండు సినిమాలను పూర్తి చేసి ఎన్నికల ముందు రిలీజ్ చేయాలనేది ఆర్జీవీ ప్లాన్. అయితే ఆ ప్లాన్ లో కాస్త మార్పులు జరిగినట్టు తెలుస్తోంది.

వై.ఎస్.జగన్ పార్టీ పెట్టినప్పటి నుంచి అతని పరిపాలన వరకూ సాగిన ప్రయాణాన్ని తెరకెక్కించేందుకు రామ్ గోపాల్ వర్మ సిద్ధమయ్యారు. వీటికి వ్యూహం, శపథం అని పేర్లు కూడా గతంలోనే అనౌన్స్ చేశారు. వై.ఎస్. మరణం నుంచి జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేవరకూ వ్యూహంను, జగన్ పరిపాలనపై శపథంను రెండు భాగాలుగా తెరకెక్కించాలని నిర్ణయించారు. వ్యూహం టీజర్ కూడా గతంలోనే రిలీజ్ చేశారు. ఇది ఆకట్టుకుంది. అయితే రెండు పార్టులుగా తీయాలనుకున్న సినిమాను ఇప్పుడు ఒక పార్ట్  కే కుదించినట్టు తెలుస్తోంది. దీన్ని వీలైనంత వరకూ పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్ 1న రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఉన్నారు ఆర్జీవీ. త్వరలోనే దీనికి సంబంధించిన రెండో టీజర్ కూడా రిలీజ్ కానుంది.

వ్యూహం సినిమాకు సంబంధించి రేపటి నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభం కానుంది. వారధిపై పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. వారం రోజులపాటు ఈ ఏరియాలో షూటింగ్ జరిగేలా షెడ్యూల్ రెడీ చేశారు. మరోవైపు.. రెండో టీజర్ లో ఎక్కువగా పవన్ కల్యాణ్ పై ఫోకస్ పెడ్తున్నట్టు సమాచారం. పవన్ కల్యాణ్ పార్టీ నుంచి ఆయన గాజువాక, భీమవరంలో పోటీ చేసి ఓడిపోవడం వరకూ ఈ టీజర్ లో ఉండే అవకాశం కనిపిస్తోంది. ఓడిన తర్వాత పవన్ రియాక్షన్ ను కూడా ఇందులో చూపిస్తారని టాక్.