Samantha: శాకుంతల అసలు కథ ఇదే..

గుణశేఖర్ డైరెక్షన్‌లో సమంత హీరోయిన్‌గా ఎన్నో అంచనాలతో వచ్చిన శాకుంతలం సినిమా ఫస్డ్‌ డేనే యావరేజ్‌ టాక్‌ తెచ్చుకుంది. సమంతను శంకుతలగా చూపించడంలో గుణశేఖర్‌, శంకుతల క్యారెక్టర్‌ చేయడంలో సమంత ఫెయిల్‌ అయ్యారని విమర్శలు వచ్చాయి. దీంతో అసలు శకుంతల ఎవరు ? ఆమె కథ ఏంటి ? అని అంతా డిస్కర్స్‌ చేస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుతలం ఆధారంగా శాకుంతలం సినిమా తీశారు.

  • Written By:
  • Publish Date - April 16, 2023 / 03:30 PM IST

విశ్వామిత్ర మహర్షి, మేనకలకు పుట్టిన పాపే శకుంతల. దేవతల అనుగ్రహాన్ని పొందేందుకు విశ్వామిత్ర మహర్షి ఘోరమైన కఠోర తపస్సు చేస్తూ ఉంటాడు. విశ్వామిత్రుడికి దేవతల అనుగ్రహం వస్తే భూమి, స్వర్గంపై పట్టు సాధిస్తాడు. అది తన పీఠానికి ప్రమాదం అనుకున్న ఇంద్రుడు విశ్వామిత్ర మహర్షి తపస్సును భంగం చేసేందుకు ప్రయత్నిస్తాడు. విశ్వామిత్రుడి తపస్సును భంగం చేయమని అప్సరసల్లో ఒకరైన మేనకను భూమి మీదకు పంపిస్తాడు. ఇంద్రుడు చెప్పినట్టుగానే తన అందంతో విశ్వామిత్రుడి తపస్సును భంగం చేస్తుంది మేనక. మేనక అందానికి ముగ్ధుడైన విశ్వామిత్రుడు ఆమె వలలో పడిపోతాడు. వాళ్లిద్దరికీ ఓ పాప జన్మిస్తుంది. ఆ పాపే శకుంతల.

తను వచ్చిన పని పూర్తవడంతో మేనక తిరిగి స్వర్గానికి వెళ్తుంది. విశ్వామిత్రుడు కూడా తిరిగి తన తపస్సు ప్రారంభిస్తాడు. దీంతో శకుంతల అనాథగా మిగిలిపోతుంది. అడవిలో ఉండే జంతువులు, పక్షులే శకుంత ఆలనాపాలనా చూసుకుంటాయి. అదే సమయంలో కణ్వ మహర్ష శకుంతలను చూస్తాడు. తనతో పాటు ఆశ్రమానికి తీసుకువెళ్తాడు. అక్కడే శకుంతల పెరుగుతుంది. కొన్నేళ్ల తరువాత అక్కడకు వేటకు వచ్చిన దుష్యంతుడు కణ్వ మహర్షి ఆశ్రమం మీదుగా వెళ్తూ శకుంతలను చూస్తాడు. ఆమె అందానికి ముగ్ధుడై.. శకుంతలతో ప్రేమలో పడతాడు. కొన్ని రోజులకు తాను తన రాజ్యానికి వెళ్తున్నానని.. తరువాత మహర్షులతో వచ్చిన పెళ్లి చేసుకుని తీసుకువెళ్తానని మాటిస్తాడు.

కానీ అప్పటికే శకుంతల గర్భవతి. అప్పటి నుంచి దుష్యంతుని తలపులతోనే బతికేస్తుంది శకుంతల. ఒక రోజు దుర్వాస మహాముని కణ్వమహర్షి ఆశ్రమానికి భిక్షాటనకు వస్తాడు. కానీ దుష్యంతుని ఆలోచనల్లో లీనమైన శకుంతల దుర్వాసున్ని గుర్తించదు. దీంతో దుర్వాస మహాముని శకుంతలను శపిస్తాడు.. నువ్‌ ఎవరి గురించి ఆలోచిస్తున్నావో ఆ వ్యక్తి నిన్ను పూర్తిగా మర్చిపోతాడంటూ శపిస్తాడు. కానీ శకుంతల తన పరిస్థితిని వివరించడంతో శాపానికి విముక్తి చెప్తాడు. దుష్యంతుడు నీకు ఇచ్చిన ఏదైనా వస్తువు చూపిస్తే మర్చిపోయిన విషయం అతనికి గుర్తుకు వస్తుందని చెప్పి వెళ్లిపోతాడు.

కానీ ఓ రోజు శకుంతల నది దగ్గర స్నానం చేస్తుండగా దుష్యంతుడు ఇచ్చిన ఉంగరం నీటిలో పడిపోతుంది. కానీ ఈ విషయాన్ని శకుంతల గుర్తించదు. ఇదంతా దివ్య దృష్టితో చూసిన కణ్వ మహర్షి శంకుతలను దుష్యంతుని దగ్గరకు పంపిస్తాడు. అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పి తన చేతికి ఉన్న ఉంగరాన్ని చూపించే ప్రయత్నం చేస్తుంది శకుంతల. కానీ చేతికి ఉంగరం లేకపోవడంతో అంతా ఆమెను దొంగగా భావిస్తారు. రాజ్యం నుంచి పంపేస్తారు. ఎంతో బాధతో అడవికి వచ్చేస్తుంది శకుంతల. కొంత కాలానికి భరతునికి జన్మనిస్తుంది. కొన్ని రోజులకు శకుంతల పారేసుకున్న ఉంగరాన్ని ఓ చేప మింగుతుంది.

తరువాత అనుకోకుండా ఓ జాలరి వలలో పడుతుంది ఆ చేప. ఆ జాలరి ఇంటికి వెళ్లి చేపను కట్ చేయగానే అందులో నుంచి ఉంగరం బయటకు వస్తుంది. వెంటనే ఆ ఉంగరాన్ని అమ్మే ప్రయత్నం చేస్తాడు ఆ జాలరి. ఉంగరాన్ని కొనేందుకు వచ్చిన వ్యాపారి.. ఆ ఉంగరం దుష్యంతుడిదని గుర్తిస్తాడు. జాలరిని దొంగ అనుకుని రాజు దగ్గరికి తీసుకువెళ్తాడు. ఆ ఉంగరాన్ని చూడగానే దుష్యంతునికి జరిగిన విషయం గుర్తుకువస్తుంది. వెంటనే కణ్వ మహర్షి ఆశ్రయానికి వెళ్తాడు. దారిలో భరతున్ని చూస్తాడు. చిన్నతనంలోనే క్రూర మృగాలతో పోరాడుతున్న అతని పోరాటపటిమకు ముగ్ధుడైపోతాడు. తరువాత శకుంతలను కలుసుకుని తాను చూసింది తన కొడుకునే అని గుర్తిస్తాడు.

అక్కడి నుంచి శకుంతలను తన రాజ్యానికి తీసుకువెళ్లి చాలా ఘనంగా పెళ్లి చేసుకుంటాడు. ఇది అసలైన శకుంతల కథ. కానీ ఈ కథలో ఎమోషన్‌ను పండించడంలో గుణశేఖర్‌ ఫెయిల్‌ అయ్యాడు. శంకుతలోని చలాకీతనాన్ని సమంత చూపించలేకపోయింది. ల్యాగ్‌గా సాగే గ్రాఫిక్స్‌ సినిమాకు కార్టూన్‌ లుక్‌ తెచ్చాయి. ఇండియన్‌ షేక్‌స్పియర్‌గా భావించే కళిదాసు రాసిన నాటికను ఏదో చేయాలనుకుని ఇలా ప్రజెంట్‌ చేశాడు గుణశేఖర్‌.