Shah Rukh Khan: షారుఖ్ ఖాన్‌కు భద్రత పెంపు.. కారణమిదే..!

ముంబైలో షారుఖ్‌ ఖాన్‌ నివాసం ఉంటున్న మన్నత్ రెసిడెన్స్‌కూ తరచూ డెత్ నోట్స్ వచ్చాయి. ఈ బెదిరింపులపై షారుఖ్ బృందం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం షారుఖ్‌కు వై ప్లస్ కేటగిరి భద్రతను కల్పించింది.

  • Written By:
  • Publish Date - October 9, 2023 / 08:45 PM IST

Shah Rukh Khan: పఠాన్, జవాన్ వంటి వరుస బ్లాక్‌బస్టర్లతో ఊపుమీదున్న బాలీవుడ్ సూపర్ స్టార్, కింగ్ ఖాన్‌కు షాక్ తగిలింది. ఈ సినిమాల సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న షారుఖ్‌కు ఇటీవల బెదిరింపులు వచ్చాయట. ఆయనను చంపేస్తామని బెదిరింపులు వచ్చినట్లు తేలింది. ముంబైలో షారుఖ్‌ ఖాన్‌ నివాసం ఉంటున్న మన్నత్ రెసిడెన్స్‌కూ తరచూ డెత్ నోట్స్ వచ్చాయి. ఈ బెదిరింపులపై షారుఖ్ బృందం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో స్పందించిన మహారాష్ట్ర ప్రభుత్వం షారుఖ్‌కు వై ప్లస్ కేటగిరి భద్రత కల్పించింది.

ఈ వై ప్లస్ భద్రతలో మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది రక్షణగా ఉంటారు. అందులో ఆరుగురు పోలీసు కమాండోలు కూడా ఉంటారు. వీళ్లు ఎంపీ-5 మెషిన్ గన్‌లు, ఏకే 47 అస్సాల్ట్ రైఫిల్స్, గ్లాక్ పిస్టల్స్‌ వంటి ఆయుధాలు కలిగి ఉంటారు. షారుఖ్ ఖాన్ నివాసానికి ఈ నలుగురు సాయుధ పోలీసులు కూడా భద్రత కల్పిస్తారు. ఇరవైనాలుగు గంటలూ వీళ్లు అంగరక్షకులుగా ఉంటారు. సాయుధ అంగరక్షకులంతా మహారాష్ట్ర పోలీసుల ప్రత్యేక రక్షణ విభాగానికి చెందినవారు. షారుఖ్ ఖాన్‌కు ఇండియాలో ఎక్కడికెళ్లినా ఈ భద్రత కల్పిస్తారు. ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా షారుఖ్ ఖాన్ ప్రాణాలకు ముప్పు ఉందని తెలియడంతో మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అయితే ఈ భద్రతకయ్యే ఖర్చును షారుఖ్ ఖాన్ చెల్లించనున్నారు. షారుఖ్ కంటే ముందు సల్మాన్‌‌కు కూడా ప్రభుత్వం భద్రత కల్పిస్తున్న సంగతి తెలిసిందే. సల్మాన్‌ను చంపుతామని గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన నేపథ్యంలో ఆయనకు కూడా ప్రభుత్వం భద్రత కల్పిస్తోంది. కాగా, షారుఖ్ నటించిన జవాన్ ఇప్పటి వరకు ఇండియాలో రూ.618.83 కోట్ల వసూళ్లను, ప్రపంచవ్యాప్తంగా రూ.1,103 కోట్లు వసూళ్లను సాధించింది.