జాతీయ ఆవార్డుల్లో జెండా పాతిన సౌత్

  • Written By:
  • Publish Date - August 16, 2024 / 06:07 PM IST

పాన్ ఇండియా సినిమాలతో దుమ్ము రేపుతున్న సౌత్ ఇండియా ఇప్పుడు జాతీయ అవార్డుల్లో కూడా సత్తా చాటింది. ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదని సౌత్ ఇండియన్ సినిమాలు ప్రూవ్ చేసాయి. కీలకమైన విభాగాల్లో సౌత్ ఇండియన్ సినిమా నటులు, దర్శకులు అవార్డులు సొంతం చేసుకున్నారు. 70వ జాతీయ చలనచిత్ర అవార్డులను నేడు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. 2022లో విడుదలైన సినిమాలకు గానూ… కేంద్ర సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ఈ అవార్డులను ప్రకటించింది.

కాంతారా చిత్రానికి గానూ రిషబ్ శెట్టి ఉత్తమ నటుడి అవార్డును గెలుచుకోగా, ఉత్తమ నటిగా తిరుచిత్రంబలం సినిమాకు నిత్యా మీనన్ అలాగే కచ్ ఎక్స్ప్రెస్ సినిమాకు మానసి పరేఖ్ లు అవార్డు సొంతం చేసుకున్నారు. బెస్ట్ తెలుగు ఫిల్మ్ గా కార్తికేయ2 నిలిచింది. బెస్ట్ డైరెక్టర్ గా సూరజ్ ను జాతీయ అవార్డు వరించింది. ‘ఉంచాయ్’ మూవీకి గాను ఈ అవార్డు సాధించాడు. బెస్ట్ కొరియోగ్రాఫర్లుగా జానీ మాస్టర్, సతీశ్ కృష్ణన్ ఎంపిక అయ్యారు. బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్ లో పవన్ రాజ్ అవార్డు గెలుచుకున్నాడు.

ఉత్తమ నటి సపోర్టింగ్ రోల్ కేటగిరిలో నీనా గుప్తా… ఉంచాయ్ సినిమాకు అవార్డు సొంతం చేసుకుంది. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ – శ్రీపత్ (మళ్లికాపురం), ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ మేల్ – అర్జీత్ సింగ్ (కేసరియా – బ్రహ్మాస్త్ర -1) ఉత్తమ ప్లే బ్యాక్ సింగర్ ఫీమేల్ – బాంబే జయశ్రీ జాతీయ అవార్డులను సొంతం చేసుకున్నారు. ఇక బెస్ట్ సినిమాటోగ్రఫీ అవార్డును పొన్నియన్ సెల్వన్ -1 సినిమాకు గానూ రవి వర్మ సాధించాడు. ముంద వివిధ ప్రాంతీయ భాషల్లో ఉత్తమ చిత్రాలకు మాత్రమే గుర్తింపునిచ్చి అవార్డులు ఇచ్చేవారు. అయితే సినిమాలకు పని చేస్తున్న నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు అవార్డులు మొదటిసారిగా 1967లో అందించడం మొదలుపెట్టారు. ఈ అవార్డులను ఫీచర్ ఫిల్మ్ జ్యూరీ చైర్‌పర్సన్ రాహుల్ రావైల్ ప్రకటించారు