T20, World Cup : సూపర్ 8లో భారత్ షెడ్యూల్ ఇదే.. తొలి మ్యాచ్ ఎవరితో అంటే ?

టీ 20 ప్రపంచకప్ లో లీగ్ మ్యాచ్ లు దాదాపు ముగిసిపోతున్నాయి. సూపర్ 8కి కూడా దాదాపు 6 దేశాలు క్వాలిఫై అయిపోయాయి. కెనడాతో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియా సూపర్ 8 ఆడేందుకు వెస్టిండీస్ బయలుదేరనుంది.

 

 

 

టీ 20 ప్రపంచకప్ లో లీగ్ మ్యాచ్ లు దాదాపు ముగిసిపోతున్నాయి. సూపర్ 8కి కూడా దాదాపు 6 దేశాలు క్వాలిఫై అయిపోయాయి. కెనడాతో చివరి లీగ్ మ్యాచ్ ఆడిన తర్వాత టీమిండియా సూపర్ 8 ఆడేందుకు వెస్టిండీస్ బయలుదేరనుంది. ఇప్పుడు సూపర్ 8 లో మన టీమ్ ఇండియా మ్యాచ్ లు ఎవరెవరితో ఆడుతుందనే వాటిపై చర్చ సాగుతోంది. జూన్ 19 నుంచి సూపర్ 8 మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. సూపర్ 8లో రోహిత్ సేన మొదటి మ్యాచ్ జూన్ 20న ఆఫ్గనిస్తాన్ తో ఆడనుంది. గ్రూప్ డి నుంచి బంగ్లాదేశ్ కూడా దాదాపు చేరినట్టే అనుకోవాలి.

ఒకవేళ వారు ఓడినా 4 పాయింట్లతో ఆ జట్టే సూపర్ 8కి వస్తుంది. అందుకే జూన్ 22న రెండో మ్యాచ్ బంగ్లాదేశ్ తో జరగనుంది. ఇక సూపర్ 8 లో చివరి మ్యాచ్ ను జూన్ 24న ఆస్ట్రేలియాతో ఆడనుంది. సూపర్ 8లో మొదటి రెండు మ్యాచ్ ల్లో గెలిస్తే భారత్ సెమీఫైనల్ చేరడం పెద్ద కష్టం కాదు. అలా అని ఆఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లను తేలిగ్గా తీసుకుంటే ఓటమి తప్పదు. లీగ్ స్టేజ్ లో బౌలింగ్ ఆకట్టుకున్నా, బ్యాటింగ్ మాత్రం గాడిలో పడలేదు. అందుకే విండీస్ పిచ్ లపై స్టార్ ప్లేయర్స్ అందరూ అదరగొట్టలని ఫాన్స్ కోరుకుంటున్నారు.
ఇక ఆస్ట్రేలియాతో మ్యాచ్ మాత్రం హోరాహోరీగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
ఆ జట్టు ఓపెనర్లు, మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ అంతా పటిష్టంగా ఉంది. బౌలింగు కూడా బాగుంది. కాకపోతే 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ కి బదులు తీర్చుకోవాలనే కసి ఉంటే మాత్రం..ఇండియా తప్పక గెలుస్తుందని అంచనా వేస్తున్నారు.