America Cars: ఒకరికి వరద నష్టం.. మరొకరికి కాసుల లాభం.. ఇదే అమెరికా – ఆఫ్రికా వ్యాపారం

న్యూయార్క్ వరదల్లో పాడైన కార్లను ఆఫ్రికా దేశాలకు ఎగుమతి చేసి అద్భుతమైన లాభాలను గణిస్తున్నారు అక్కడి మెకానిక్ సంస్థలు.

  • Written By:
  • Publish Date - October 3, 2023 / 01:12 PM IST

వరదలు మన భారతాన్నే కాదు ప్రపంచ దేశాలను కూడా వణికిస్తున్నాయి. మన్నటి వరకూ చైనాలో అకాల వర్షాల కారణంగా కొన్ని లక్షల హెక్టార్ల పంట నష్టం సంభవించింది. నిన్న మొరాకోలో భూకంపం తీవ్ర ప్రాణ నష్టాన్ని, కొంత ఆస్తి నష్టాన్ని మిగిల్చింది. అయితే తాజాగా న్యూయార్క్ లో భయంకరమైన వరదలు అక్కడి వాసులను అడుగు భయటపెట్టనివ్వడం లేదు. ఇలాంటి ప్రకృతి బీభత్సం ప్రపంచంలో ఎక్కడో ఒక చోట ప్రతి రోజూ చోటు చేసుకుంటూనే ఉంటుంది. అయితే ఒక దేశానికి సంభవించే నష్టం మరో దేశానికి అద్భుతమైన లాభాలను తీసుకురావడమే ఇక్కడి ప్రత్యేకత. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

న్యూయార్క్ వరదలు..

న్యూయార్క్ నగరం వరదల్లో చిక్కుకుంది. అక్కడి కార్లు, ఇళ్లు, షాపింగ్ మాల్స్, రెస్టారెంట్లు అన్నీ నీట మునిగాయి. ఈ పరిస్థితి ఇప్పట్లో కుదుటపడేలా కనిపించడం లేదు. నగర వాసులు భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు. రోడ్లపై పార్కింగ్ చేసిన వాహనాలు వరద నీటిలో కొట్టుకు పోతున్నాయి. ఇదంతా అక్కడ కనిపించే విచారకమైన సన్నివేశం. అయితే ఈ విచారం వెనుకు అద్భుతమైన వ్యాపారం ఉంది. అది కూడా కాసుల వర్షం కురిపిస్తోంది.

ఖరీదైన కార్లతో రిపేరు భారం..

అమెరికాలోని న్యూయార్క్ లో వరదల్లో చిక్కుకున్న, కొట్టుకుపోయిన, తడిసిన కార్లను తిరిగి ఉపయోగించరు. ఎందుకంటే ఒక్కసారి ఇంజన్, ఇంటీరియర్లో నీళ్లు వెళ్లిన వాహనాలపై వారికి అంతగా మక్కువ ఉండదు. కొన్ని ఖరీదైన కార్ల విషయంలో అయితే ఆచితూచి వ్యవహరిస్తారు. అది కూడా పరిస్థితిని బట్టి. రిపేర్ కి అయ్యే ఖర్చుమీద ఆధారపడి ఉంటుంది. ఎంతకూ పనికి రాకుంటే వాటిని వదిలేసి కొత్త కార్లు కొంటారు అక్కడి నగరవాసులు. ఇదంతా బాగానే ఉంది. మరి ఇలా పాక్షికంగా పాడైన కార్లను ఏం చేస్తారు అనే సందేహం మీలో కలుగవచ్చు. వాటిని వేలంలో అమ్మేస్తారు. వీటిని ఎవరు కొంటారు.. ఏం చేస్తారో ఇప్పుడు చూద్దాం.

వేలంలో ఆఫ్రికా దేశాలకు ఎగుమతి..

అమెరికాలో సాధారణంగా వినియోగించే కార్ల ధర 1.5 లక్షల నుంచి 2 లక్షల వరకూ ఉంటుంది. ఒక్కసారి ఇంజన్లో బురద, నీరు చేరకుంటే ఆ కార్ల విలువ అమాంతం పడిపోతుంది. 5వేల డాలర్లకు మించి ఎవరూ కొనుగోలు చేయరు. ఇన్సురెన్స్ క్లైమ్ చేసుకొని కొత్త కార్లు కొనేందుకు ఇష్టపడతారు. అందుకే ఇక్కడి ఇన్సురెన్స్ కంపెనీల పాలసీలు వేరుగా ఉంటాయి. ఈ కంపెనీలు వరదలో దెబ్బతిన్న వాటిని జంక్ యార్డ్, వెహికల్ రీ బిల్డర్లకు సాల్వేజ్ వేలంలో వేస్తారు. ఈ వేలంపాటలో కొనుగోలు చేసిన కార్లను కెన్యా, జింబాంబ్వే, నైజీరియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తారు.
ఇలా వరదల్లో మునిగి పాడైన కారును పరిశీలించి వాటిలోని ఇంటీరియర్, ఇంజన్ సమస్యలపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తాయి ఈ దేశాలు. చిన్నపాటి రిపేర్ చేసి మళ్లీ కండీషన్లోకి తెచ్చి విక్రయిస్తాయి. అప్పుడు వీటి ధర 40వేల డాలర్ల నుంచి 50 వేల డాలర్ల వరకూ ఉంటుంది. 2లక్షల డాలర్ల కారు కేవలం 50 వేల డాలర్లకే అందుబాటులోకి రావడంతో చాలా మంది ఆఫ్రికన్ దేశాల్లో వీటిని కొనుగోలు చేస్తారు.

రీ-మొడల్ చేసి తక్కువ ధరకు అమ్మకం..

ఇలా పాక్షికంగా దెబ్బతిన్న కార్లలో ఇంజిన్ తో పాటూ, కార్పెట్లు, సీట్ – మౌంట్ స్క్రూలు, హెడ్ లైట్లు, ఆయిల్ ఫిల్టర్లు, ఎయిర్ ఫిల్టర్లు, ఇంటీరియర్ వంటివి దెబ్బతింటాయి. వీటిని అలాగే ఉపయోగిస్తే తుప్పు పట్టి పూర్తిగా కారు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుకే వీటిని తొలగించి రీ మొడలింగ్ చేసి తక్కువ ధరలకు విక్రయిస్తారు. అమెరికాలో ప్రతి కారు సాఫ్ట్ వేర్ ఆధారంగానే నడుస్తుంది. నీటిలో మునిగిన కారులోని సాఫ్ట్ వేర్ చిప్ తో సహా మానిటర్ స్క్రీన్ దెబ్బతింటుంది. వీటిని కూడా కొత్తగా అమర్చుతారు. వీటికోసం చైనా ఒక ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ను రూపొందించింది. తద్వారా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కచ్చితమైన నాణ్యమైన కార్లుగా తీర్చిదిద్దబడుతున్నాయి. మన దేశం ఇలాంటి ఉత్పత్తులను ప్రోత్సహించడం లేదు కాబట్టి ఇండియాకు ఇవి దిగుమతి కావు.

T.V.SRIKAR