YS JAGAN: మీకోసం 124 సార్లు బటన్ నొక్కా.. జగనన్న కోసం రెండుసార్లు బటన్ నొక్కలేరా: జగన్

రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఆయుధాలుగా కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దాం. నా కుటుంబ సైన్యమంతా ఇక్కడ కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - February 3, 2024 / 06:52 PM IST

YS JAGAN: ప్రజల కోసం తాను 124సార్లు బటన్ నొక్కానని, తన కోసం ప్రజలు రెండుసార్లు బటన్ నొక్కలేరా అని ప్రశ్నించారు ఏపీ సీఎం వైఎస్ జగన్. తాను ఒంటరిని కాదని, తనకు ప్రజలే అండగా ఉన్నారని వ్యాఖ్యానించారు జగన్. ఏలూరులో శనివారం నిర్వహించిన సిద్ధం 2 సభలో జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతిపక్షాలపై తీవ్ర విమర్శలు చేశారు. “14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ప్రజల కోసం ఏం చేశారు..? ఒక్క రూపాయైనా ప్రజల ఖాతాల్లో వేశారా..? రాబోయే ఎన్నికల యుద్ధంలో మీరు (ప్రజలు) కృష్ణుడైతే నేను అర్జునుడిని. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలే ఆయుధాలుగా కౌరవ సైన్యంపై యుద్ధం చేద్దాం.

Jharkhand MLAs: హైదరాబాద్‌లో ఝార్ఖండ్ ఎమ్మెల్యేలు.. భారీ భద్రత.. కలిసేందుకు నో ఛాన్స్

నా కుటుంబ సైన్యమంతా ఇక్కడ కనిపిస్తోంది. రామాయణం, మహాభారతంలో ఉన్న విలన్లు అందరూ చంద్రబాబు, ఎల్లో మీడియా, దత్తపుత్రుడు, విపక్షాల రూపంలో ఇక్కడే ఉన్నారు. ఇంతమంది తోడేళ్ల మధ్య జగన్ ఒంటరిగానే కనిపిస్తాడు. కానీ కోట్ల మంది హృదయాల్లో ఉన్నాడు. వైసీపీ ప్రభుత్వ సంక్షేమం, మంచిపై విపక్షాలు దాడి చేస్తున్నాయి. పేదవాడి సంక్షేమం మీద, రాబోయే తరం విద్యావిధానాలపై దాడి చేస్తున్నారు. పెత్తందారులు ఎవరిపై దాడి చేస్తున్నారో ఆలోచించండి. సంక్షేమం, అభివృద్ధిపై ప్రతిపక్షాలు దాడి చేస్తున్నాయి. వారికి ఉన్న సైన్యం పొత్తులు అయితే.. నాకున్న తోడు, ధైర్యం, బలం.. పైనున్న దేవుడు, ప్రజలు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేరుగా ఇంటి వద్దకే పథకాలు అందేలా చేస్తున్నాం. వైసీపీ ప్రభుత్వంలో కుప్పం నుంచి ఇచ్చాపురం వరకూ సచివాలయాలు ఏర్పాటు చేశాం. వాటి ద్వారా 500లకు పైగా సేవలు అందిస్తున్నాం. డీబీటీ ద్వారా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి నేరుగా సొమ్ము జమ చేస్తున్నాం.

పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. నాడు -నేడు పథకం ద్వారా స్కూళ్ల రూపు రేఖలు మార్చేశాం. రాష్ట్రంలో కొత్తగా 15 మెడికల్ కాలేజీలు కడుతున్నాం. కొత్తగా 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు నిర్మిస్తున్నాం. వచ్చే ఎన్నికలు పేదల భవిష్యత్ నిర్ణయించేవి. రూ.3 వేల పెన్షన్ అందాలన్నా.. భవిష్యత్తులో పెరగాలన్నా మీ జగనే మళ్లీ అధికారంలోకి రావాలి. జరుగుతున్న మంచి కొనసాగాలంటే జగనన్న ఉంటేనే సాధ్యమని చెప్పాలి. మీకోసం 57 నెలల్లో 124 సార్లు బటన్ నొక్కా. జగనన్న కోసం ఒక్కసారి.. రెండు బటన్లు నొక్కలేరా..? ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంట్‌కు ఫ్యాన్ మీద నొక్కాలి” అని జగన్ వ్యాఖ్యానించారు.