AP PENSIONS: టిడిపి సెల్ఫ్ గోల్.. దెబ్బ కొట్టనున్న పెన్షనర్లు

మూడు రోజులు ఆలస్యంగా గ్రామ సచివాలయంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్నప్పటికీ.. ఎండలు మండిపోతున్న సమయంలో వృద్ధులు నానా అగచాట్లు పడుతూ పెన్షన్లు తీసుకోవడం టిడిపికి పెద్ద ఎదురుదెబ్బే. వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు టిడిపి, జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

  • Written By:
  • Publish Date - April 3, 2024 / 07:24 PM IST

AP PENSIONS: ఎన్నికల దగ్గరవుతున్న కొద్దీ తెలుగుదేశం పార్టీ తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్తోంది. తన అవకాశాలను తానే దెబ్బ తీసుకుంటుంది. టిడిపి సానుభూతిపరుడు, రాష్ట్ర ఎన్నికల సంఘం మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ బాబు చేసిన పని ఇప్పుడు అసలుకే ఎసరు తెచ్చింది. తెలుగుదేశం పార్టీ విజయవకాశాలను దెబ్బతీసేటట్లు మారింది రమేష్ బాబు చర్య. ఈనెల 1న ఆంధ్రప్రదేశ్‌లో వాలంటీర్లు స్వయంగా ఇళ్ల కెళ్ళి వృద్ధాప్యపు పింఛన్లు ఇవ్వడాన్ని అడ్డుకోవాలని.. రమేష్ బాబు ఎలక్షన్ కమిషన్‌కు లేఖ రాశారు. దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం వాలంటీర్లను ఇళ్లకు వెళ్లి పెన్షన్లు ఇవ్వొద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్ల విధులను పూర్తిగా నిలిపివేసింది.

KTR: మాస్ వార్నింగ్.. హీరోయిన్ల ఫోన్లు ట్యాపింగ్.. కేటీఆర్ షాకింగ్ కామెంట్స్..!

పెన్షనర్లు గ్రామ సచివాలయాలకు వెళ్లి పెన్షన్స్ తీసుకోవాలని కూడా కోరింది. కేవలం వికలాంగులు, దివ్యాంగులు, 80 ఏళ్ల పైబడిన వృద్ధులకు రెవెన్యూ ఉద్యోగులు ఇంటికి వెళ్లి పెన్షన్ అందించాలని తన ఆదేశాల్లో పేర్కొంది ఎన్నికల సంఘం. గడచిన అయిదేళ్లుగా ఒకటో తారీఖున తెల్లవారు జామున వాలంటీర్ స్వయంగా తీసుకొచ్చి పెన్షన్ ఇస్తే తీసుకోవడం అలవాటు చేసుకున్న వృద్ధులు.. ఒక్కసారిగా ఇప్పుడు మైళ్ళ దూరంలో ఉన్న గ్రామ సచివాలయానికి వెళ్లి పెన్షన్స్ తీసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పరిస్థితిని వైసిపి రాజకీయంగా తనకు అనుకూలంగా మలుచుకుంది. గ్రామ సచివాలయానికి వచ్చి పెన్షన్లు తీసుకోవాలని రెవిన్యూ అధికారులు పెన్షనర్లను ఆదేశించారు. మరోవైపు చంద్రబాబు నాయుడు వల్లే ఇంటికి పెన్షన్స్ రావడం లేదని ప్రచారం మొదలు పెట్టింది వైసిపి. మూడు రోజులు ఆలస్యంగా గ్రామ సచివాలయంలో పెన్షన్ల పంపిణీ జరుగుతున్నప్పటికీ.. ఎండలు మండిపోతున్న సమయంలో వృద్ధులు నానా అగచాట్లు పడుతూ పెన్షన్లు తీసుకోవడం టిడిపికి పెద్ద ఎదురుదెబ్బే. వైసీపీ కార్యకర్తలు, వాలంటీర్లు టిడిపి, జనసేనకు వ్యతిరేకంగా ప్రచారం చేయడం మొదలుపెట్టారు. వృద్ధుల దగ్గరికి వెళ్లి.. చూశారుగా.. మీకు పెన్షన్ రాకుండా చంద్రబాబు అడ్డుకున్నాడు, ఆయన అధికారంలోకి వస్తే అసలు పెన్షన్‌లే రావు అంటూ మనిషి మనిషికి చెప్తున్నారు.

Killi Krupa Rani: వైసీపీకి కిల్లి కృపారాణి గుడ్ బై.. ఏ పార్టీలో చేరుతున్నారంటే..

మరోవైపు గ్రామ సచివాలయాల దగ్గర ఎండలో పడిగాపులు పడలేక ముసలాళ్లు ఉసురుమంటున్నారు. ఇప్పటికే ఇద్దరు చనిపోయారు. దీంతో పెన్షనర్లు.. టిడిపి, జనసేన, బిజెపిలను తిట్టిపోస్తున్నారు. జగన్ తమకు పెన్షన్ ఇస్తుంటే.. మీరు అడ్డుకుంటారా అంటూ శాపనార్ధాలు పెడుతున్నారు. 45 ఏళ్ల రాజకీయం అనుభవం ఉన్న చంద్రబాబు.. వైసిపి ఎత్తుగడను ముందుగా ఎందుకు ఊహించలేకపోయారు..? నిజానికి ఎన్నికల సంఘం వాలంటీర్ల ద్వారా ఇళ్లకు పెన్షన్లు పంపవద్దు అని ఆదేశించిందే తప్ప.. ఇళ్లకు పెన్షన్లు పంపుద్దని చెప్పలేదు. వాలంటీర్ల బదులు రెవెన్యూ సిబ్బంది వెళ్లొచ్చు. కానీ పరిస్థితిని వైసీపీ సర్కార్ తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. యుద్ధం మొదలుపెట్టిన తర్వాత ఎటు నుంచి అయినా పొడవచ్చు. ఫైనల్‌గా గెలుపు మాత్రమే కావాలి. ఇప్పుడు వైసీపీ అదే చేస్తుంది. ఇది టిడిపి, జనసేన పార్టీలు ఊహించలేకపోయాయి. రమేష్ బాబు.. పార్టీలకు మేలు చేసే విధంగా ఎన్నికల సంఘానికి లేఖ రాసి అసలుకే ఎసరు తెచ్చారు. ఇప్పుడు టిడిపి, జనసేన పై 70 లక్షలకు పైగా పెన్షనర్లు మండిపడుతున్నారు. రేపు వీళ్లంతా ఎన్నికల్లో అడ్డం తిరిగితే ఏంటి పరిస్థితి అని టిడిపి నాయకులే ఇప్పుడు జుట్టు పీక్కుంటున్నారు.

అనవసరంగా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నామా అని కొందరు స్థానిక టిడిపి జనసేన నేతలు బహిరంగంగానే మాట్లాడుతున్నారు. వచ్చిన అవకాశాన్ని వైసిపి వదులుకుంటుందా..? రాజకీయంగా దీనిపై ఎంత గబ్బు లేపాలో అంతా లేపుతోంది. పెన్షనర్లను కావలసినంతగా రెచ్చగొడుతుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్వయంగా తెలుగుదేశాన్ని దుమ్మెత్తి పోస్తున్నారు. నా అవ్వా తాతలకు పెన్షన్ ఇవ్వకుండా చేస్తారా.. అంటూ తనదైన స్టైల్‌లో చెలరేగి పోతున్నారు. అయ్యవారి బొమ్మ గీయబోతే అది కాస్త కోతి అయిపోయినట్లు.. వాలంటీర్లను ఏదో చేద్దాం అనుకుంటే అది పెన్షనర్ల రూపంలో బూమరాంగ్ అయింది. టిడిపి జనసేన ఓట్లకు గండి కొట్టబోతోంది.