Hyderabad Bomb Blast: హైదరాబాద్‌లో పేలుళ్లకు కుట్ర.. ATS విచారణలో సంచలన నిజాలు..

రీసెంట్‌గా గుజరాత్‌లో అరెస్ట్‌ చేసిన సుమేరా బాను విచారణలో సంచలన నిజాలు బయపెట్టారు ఏటీఎస్‌ అధికారులు. సుమేరాతో చాటింగ్‌ చేసిన ముగ్గురు వ్యక్తులను కూడా హైదరాబాద్‌లో అరెస్ట్‌ చేశారు.

  • Written By:
  • Publish Date - June 30, 2023 / 12:11 PM IST

ఇస్లామిక్‌ స్టేట్‌ ఆఫ్‌ కురాసిన్‌ ప్రావిన్స్‌ సంస్థకు చెందిన సుమేరా అలియాస్‌ అబిదా అలియాస్‌ ఖదియా.. అత్యంత భయంకరమైన మహిళ అని చెప్తున్నారు అధికారులు. ఇండియాలో ఐఎస్‌కేసీని విస్తరించేందుకు భారీ ప్లాన్‌ చేసినట్టు ఏటీఎస్‌ అధికారుల విచారణలో వెల్లడైనట్టు చెప్పారు. ఇందుకోసం సుమేరా సోషల్‌ మీడియాను ఎక్కువగా వాడుకున్నట్టు గుర్తించారు. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ చాలా రాష్ట్రాలకు చెందిన వ్యక్తులతో సుమేరాకు లింకులు ఉన్నాయని చెప్తున్నారు. ముఖ్యంగా గుజరాత్‌, తెలంగాణ, ఉత్తర్‌ప్రదేశ్‌, కశ్మీర్‌లో ఐఎస్‌కేపీ సంస్థకు చెందిన వ్యక్తులు ఎక్కువగా ఉన్నారని అధికారులు అనుమానిస్తున్నారు.

దేశంలో యూత్‌ను రాడికలైజ్‌ చేసి వాళ్లను ఉగ్ర కార్యకలాపాలకు వినియోగించుకోవాలని సుమేరా ప్లాన్‌ చేసిందట. అందులో భాగంగానే హైదరాబాద్‌లో మకాం వేసేందుకు ప్లాన్‌ చేసినట్టు చెప్తున్నారు. హైదరాబాద్‌లో యూత్‌కు ఉగ్ర శిక్షణతో పాటు భారీ విధ్వంసానికి కూడా కుట్రపన్నినట్టు విచారణలో తేలిందంటున్నారు. ఇక గుజరాత్‌లోని పోర్‌బందర్‌లో ఓ బోట్‌ను హైజాక్‌ చేసేందుకు సుమేరా ప్లాన్‌ చేసిందని అధికారులు చెప్తున్నారు. తనతో ఉన్న గ్యాంగ్‌లో బోట్‌లో ఆఫ్ఘానిస్తాన్‌ పారిపోయేందుకు సుమేరా ప్రయత్నించిందట. అక్కడి ఫిదాయిన్‌ దాడులకు ప్లాన్‌ చేసిందట.

ఆఫ్ఘాన్‌ వెళ్లాలి అనుకున్న సుమేరా హైదరాబాద్‌ ఎందుకు రావాలనుకుంది అన్న కోణంలో విచారణ చేస్తే.. ఇక్కడ విధ్వంసానికి ప్లాన్‌ చేసిన విషయం బయటకు వచ్చింది. ప్రస్తుతం సుమేరాతోపాటు గుజరాత్‌లో అరెస్ట్‌ ఐన గ్యాంగ్‌, హైదరాబాద్‌లో అరెస్ట్‌ ఐన ముగ్గురు వ్యక్తులను ఏటీఎస్‌ అధికారులు విచారిస్తున్నారు. ఇండియాలో ఇంకా చాలా మందితో వీళ్లు టచ్‌లో ఉన్నట్టు అనుమానిస్తున్నారు. ఈ ట్విస్ట్‌తో కశ్మీర్‌, యూపీ, తెలంగాణ, గుజరాత్‌ రాష్ట్రాల్లో మరిన్ని అరెస్ట్‌లు జరిగే అవకాశముంది. విచారణ పూర్తి స్థాయిలో ముగిసిన తరువాత ఈ కేసుకు సంబంధించి సంచలన విషయాలు బయటికి వస్తాయంటున్నారు ఏటీఎస్‌ అధికారులు.