Bonala Festival : బోనాలకు సిద్ధమవుతున్న భాగ్యనగరం.. జాతర ఎప్పటి నుంచి ప్రారంభమంటే

తెలంగాణ సంస్కృతి(Telangana Culture), సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ (Bonala Festival). బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్​ అన్ని ఏర్పాట్లు చేస్తుంది.

 

 

తెలంగాణ సంస్కృతి(Telangana Culture), సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం బోనాల పండుగ (Bonala Festival). బోనాల పండుగను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు రాష్ట్ర సర్కార్​ అన్ని ఏర్పాట్లు చేస్తుంది. జులై 7వ తేదీ నుంచి బోనాల జాతర షురూ కానుంది. బోనాల పండగను ఘనంగా నిర్వహించేందు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సారి బోనాల పండుగకు గతం కంటే ఎక్కువ నిధులు కేటాయిస్తామని ఎండోమెంట్‌ మినిస్టర్‌ కొండా సురేఖ చెప్పారు. గతంలో మాదిరిగా అరకొర నిధులతో, అసౌకర్యాలతో కాకుండా ఈ ఏడాది మరింత వైభవంగా బోనాల పండుగను నిర్వహిస్తామని స్పష్టం చేశారు. బోనాల పండుగకు 25 కోట్ల నిధులను మంజూరు చేసేలా సీఎం రేవంత్​ రెడ్డి (CM Revanth Reddy) తో మాట్లాడుతానని తెలిపారు.

బోనాల జాతరలో (Bonala Jatra) భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దేవాలయాల వద్ద అన్ని రకాల ఏర్పాట్లు చేస్తామన్నారు. నగరంలో 28 ఆలయాల్లో బోనాల పండుగను ప్రభుత్వం నిర్వహించబోతోంది. 9 మంది మంత్రుల అమ్మవార్లకు మొదటగా పట్టువస్త్రాలు సమర్పించబోతున్నారు. బోనాల జాతరకు భక్తులు అధిక సంఖ్యలో వస్తారని, మెట్రో, ఆర్టీసీ (RTC) స్పెషల్ సర్వీసులు నడపాలని ప్రభుత్వ నిర్ణయించింది. ఉచిత బస్సు సౌకర్యం ఉండటం వల్ల ఎక్కువ భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గట్లుగా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉత్సవాల్లో కళాబృందాలను తీసుకురావడంతో పాటు, లేజర్ షోలు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. దేవాలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి సురేఖ ఆదేశించారు.

బోనాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగు నీటి వసతి, మొబైల్ టాయిలెట్స్, దేవాలయాల వద్ద ప్రత్యేక అంబులెన్స్ సౌకర్యం, వైద్య సహాయ క్యాంప్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. వీటితో పాటు ప్రజల అవసరాల కోసం హెల్ప్​లైన్ అందుబాటులో ఉంచుతామన్నారు. త్వరలో బోనాల తేదీలను పూర్తి సమాచారంతో కూడిన క్యాలెండర్​ను విడుదల చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. దేవాలయాలకు వెళ్లే దారులన్నీ మరమ్మతులు, పారిశుద్ధ్య పనులు, విద్యుత్​ దీపాలు మరమ్మత్తులు చేయిస్తున్నారు. అటవీ శాఖ తరఫున అంబారి ఊరేగింపు కోసం ప్రత్యేకంగా ఏనుగును తెప్పించబోతున్నారు. వివిధ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున, అదనపు సర్వీసులు ఏర్పాటు చేయబోతున్నారు. దాదాపు దశాబ్ధం తరువాత తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈసారి బోనాలు అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.