KCR: రైతులకు న్యాయం చేయకపోతే వెంటాడుతాం.. నీళ్లున్నా విడుదల చేయరా: కేసీఆర్

సాగర్‌లో నీళ్లున్నప్పటికీ.. నీటిని ఎందుకు విడుదల చేయటం లేదు. ప్రభుత్వం నీటిని ఎత్తివేయకపోతే 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టులకు వెళ్తాం. నీటిని ఎత్తిపోస్తాం. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి.

  • Written By:
  • Publish Date - April 5, 2024 / 07:41 PM IST

KCR: ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు మాజీ సీఎం కేసీఆర్. రైతులకు న్యాయం చేయకపోతే వెంటాడుతామన్నారు. కరీంనగర్ జిల్లాలో పంట పొలాలను కేసీఆర్ శుక్రవారం పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

Kadiyam Kavya: కావ్యకు రెండు పార్టీల్లో శత్రువులు ! గెలుపు అంత ఈజీ కాదా!!

“కొత్త ప్రభుత్వానికి సమయం ఇవ్వాలని 4 నెలలు మాట్లాడలేదు. రైతులకు న్యాయం చేయకపోతే ఇకపై ఊరుకునేది లేదు. ప్రభుత్వాన్ని వెంటాడుతం. నేను ఎక్కడికి వెళ్తానంటే అక్కడ నీళ్లు వదులుతున్నారు. సూర్యాపేట జిల్లాకు నేను వెళ్లిన తర్వాత నీళ్లు వదిలారు. కరీంనగర్‌కు వస్తాను అనగానే.. కాళేశ్వరం నుంచి నీళ్లను విడిచిపెడుతున్నారు. తెలంగాణ వ్యవసాయం అంతా సంక్షోభానికి గురైంది. రుణమాఫీ గురించి బ్యాంకర్లతో ఎందుకు మాట్లాడటం లేదు. సాగర్‌లో నీళ్లున్నప్పటికీ.. నీటిని ఎందుకు విడుదల చేయటం లేదు. ప్రభుత్వం నీటిని ఎత్తివేయకపోతే 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టులకు వెళ్తాం. నీటిని ఎత్తిపోస్తాం. ప్రభుత్వం నీళ్లు విడుదల చేయకపోవడం వల్ల 15 నుంచి 20 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయాయి. ఈ ప్రభుత్వానికి నీటి నిర్వహణ సామర్థ్యం లేదు. తలా.. తోకా తెలియదు. ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇవాళ పంటలు ఎండిపోయాయి. సమయానికి నీళ్లు వదిళితే పంటలు ఎండిపోయేవి కావు.

Prakash Raj: బీజేపీలోకి ప్రకాష్ రాజ్.. ఈ ప్రచారంలో నిజమెంత..?

గత ఏడేళ్లు చెక్‌డ్యామ్‌లు నిరంతరం నీళ్లతో కళకళలాడేవి. కాకతీయ కాలువలో ఏడాదిలో 10 నెలలు నీళ్లు ఉండేవి. గత ఎనిమిదేళ్లు ప్రజలు ఆ ఫలాలను అనుభవించారు. ఇప్పుడు 4 నెలల్లోనే ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూస్తున్నాం. ఈ ప్రభుత్వ అసమర్థ, తెలివితక్కువతనం వల్ల ఈ పరిస్ధితి వచ్చింది. ఆత్మహత్య చేసుకున్న 209 మంది రైతుల వివరాలను సీఎస్‌కు పంపించాం. చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలి. పంట ఎండిపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు పరిహారం ఇవ్వాలి. లోటు వర్షపాతం వల్ల పంటలు ఎండిపోయాయని మంత్రులు, సీఎం చెబుతున్నారు. నీళ్లు ఇవ్వాలని కేసీఆర్ ముందే చెప్పాలిగా అని సీఎం రేవంత్ చెప్పటం సిగ్గుచేటు. ముఖ్యమంత్రి ఆయనా.. నేనా..? డిసెంబర్ 9వ తేదీన 2 లక్షల రుణమాఫీ అని ప్రకటన చేశారు. కానీ ఇప్పటివరకు చప్పుడు లేదు. మూడు నెలల కిందటి వరకు లేని కరెంట్ కష్టాలు ఇప్పుడెందుకు మొదలయ్యాయి..? ప్రభుత్వ అసమర్థత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. సిరిసిల్ల నేతన్నల పరిస్థితి దారుణంగా మారింది. ఉమ్మడి ఏపీలోని పరిస్థితులు మళ్లీ వచ్చాయని సిరిసిల్ల కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బతుకమ్మ చీరల బకాయిలు విడుదల చేయలేదు. చేనేత మిత్ర స్కీమ్ బంద్ పెట్టారు. స్కూల్ పిల్లల కోసం ప్రవేశపెట్టిన మీల్స్ స్కీమ్ కూడా ఆపేశారు. చేనేత కార్మికుల కోసం న్యాయపోరాటం చేస్తాం. హైకోర్టును ఆశ్రయిస్తాం. ఇవాళ రైతులకు భరోసా ఇచ్చాను. ప్రభుత్వం నీటిని ఎత్తివేయకపోతే 50 వేల మందితో గోదావరి ప్రాజెక్టులకు వెళ్తాం. 1.8 శాతం ఓట్ల తేడాతోనే మీరు గెలిచారు. కేవలం మీరు ఇచ్చిన తప్పుడు హామీల వల్లే ఈ శాతం ఓట్లు వచ్చాయి. రైతుబంధుపై ఈ ప్రభుత్వానికి ఒక దిశ దశ లేదు. అన్న వస్త్రం కోసం పోతే, ఉన్న వస్త్రం ఊడినట్లుగా పరిస్థితి ఉంది” అని కేసీఆర్ వ్యాఖ్యానించారు.