CBI ON KAVITHA: లిక్కర్ స్కామ్‌లో కవిత ఏం చేసింది..? వ్యాపారుల్ని బెదిరించారా..?

11 పేజీలున్న పిటిషన్ లో ఎన్నో కీలక అంశాలు బయటపడ్డాయి. కవిత గురించి కోర్టుకు కీలక విషయాలు తెలిపారు సీబీఐ అధికారులు. లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అనీ.. ఆప్‌కి వంద కోట్ల ముడుపులు కవితే చెల్లించినట్టు వివరించారు.

  • Written By:
  • Updated On - April 12, 2024 / 03:44 PM IST

CBI ON KAVITHA: ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన BRS ఎమ్మెల్సీ కవిత పీకల్లోతు కూరుకుపోతోంది. CBI అరెస్ట్ పై సవాల్ చేసిన ఆమె పిటిషన్లను రౌస్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. అంతేకాదు 5 రోజుల కస్టడీ కోసం కోర్టులో వేసిన పిటిషన్ లో CBI అనేక సంచలనాలు బయటపెట్టింది. కేజ్రీవాల్‌తో మాట్లాడి ఢిల్లీ లిక్కర్ బిజినెస్ ఇప్పించినందుకు కవిత భారీగా డబ్బులు డిమాండ్ చేసినట్టు ఆధారాలతో సహా బయటపెట్టింది సీబీఐ. 11 పేజీలున్న పిటిషన్ లో ఎన్నో కీలక అంశాలు బయటపడ్డాయి. కవిత గురించి కోర్టుకు కీలక విషయాలు తెలిపారు సీబీఐ అధికారులు.

Kadiyam Srihari Vs Rajaiah: వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా రాజయ్య.. కడియం మీద ప్రతీకారం తీర్చుకుంటారా..?

లిక్కర్ కేసులో కవిత కీలక వ్యక్తి అనీ.. ఆప్‌కి వంద కోట్ల ముడుపులు కవితే చెల్లించినట్టు వివరించారు. నకిలీ భూ విక్రయం పేరుతో అరబిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డి నుంచి 14 కోట్ల రూపాయలను కవిత తీసుకున్నారన్న సీబీఐ తెలిపింది. ఆ డబ్బుల కోసం ఆయన్ని బెదిరించినట్టు కస్టడీ పిటిషన్‌లో పేర్కొంది. మహబూబ్ నగర్ లో వ్యవసాయ భూమి ఉందనీ.. దాన్ని కొనుగోలు చేసినట్లు 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు భూమి లేకుండానే వ్యవసాయ భూమిని కొన్నట్టు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలను ఆమె సృష్టించింది. ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను 14 కోట్లు ఇవ్వలేనని శరత్ చంద్రారెడ్డి చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు సీబీఐ అధికారులు తెలిపారు. అంతేకాకుండా.. ఢిల్లీలో ఒక్కో రిటైల్ జోన్‌కి 5 కోట్లు చొప్పున ఐదు రిటైల్ జోన్లకు పాతిక కోట్ల రూపాయలు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని వివరించారు. 14కోట్లే కాకుండా.. కవిత నిర్వహిస్తున్న జాగృతి సంస్థకు 80 లక్షల రూపాయలు ముడుపులను శరత్ చంద్రారెడ్డి ఇచ్చారని సీబీఐ కస్టడీ పిటిషన్‌లో తెలిపింది.

ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌ను పరిచయం చేసినందుకు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత 50 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు. తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన 25 కోట్లు చెల్లించారన్నారు సీబీఐ అధికారులు. ఆప్‌కి వంద కోట్లు చేరవేయడంలో కవిత కీలకంగా వ్యవహరించినట్టు సీబీఐ కోర్టుకు తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కి కవితే 100 కోట్ల రూపాయలు చెల్లించారు. గోవాకు 44 కోట్ల 45 లక్షల రూపాయలను హవాలా మార్గంలో బదిలీ చేశారు. ఈ డబ్బును కవిత పిఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చినట్టు కస్టడీ పిటిషన్‌లో తెలిపింది. ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పట్లేదు. అందుకే 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు కోరారు.