CAA Notification: ఇవాళ్టి నుంచి సీఏఏ అమలు.. గెజిట్ రిలీజ్ చేసిన కేంద్రం !

పౌరసత్వ సవరణ చట్టం 2019(CAA) ను అమలు చేయబోతున్నట్టు కేంద్ర గెజిట్ రిలీజ్ చేసింది. ఈ చట్టం అమలుతో భారత్ లో తలదాచుకున్న శరణార్థులకు శాశ్వతంగా ఇక్కడే నివాసం ఉండే అవకాశం కలుగుతుంది.

  • Written By:
  • Updated On - March 11, 2024 / 06:55 PM IST

CAA Notification: సార్వత్రిక ఎన్నికల వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పౌరసత్వ సవరణ చట్టం 2019 (CAA)ను అమలు చేయబోతున్నట్టు కేంద్రం గెజిట్ రిలీజ్ చేసింది. ఈ చట్టం అమలుతో భారత్‌లో తలదాచుకున్న శరణార్థులకు శాశ్వతంగా ఇక్కడే నివాసం ఉండే అవకాశం కలుగుతుంది. 2019 డిసెంబర్‌లోనే CAA (Citizenship Amendment Act) ఆమోదం పొందింది. పార్లమెంట్ ఉభయ సభలతో పాటు అప్పటి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కూడా ఆమోదం తెలిపారు.

నాలుగేళ్ళ క్రితం CAA చట్టంగా మారినా ఇప్పటి వరకూ దీనికి సంబంధించి ఎలాంటి నిబంధనలను రూపొందించలేదు. దాంతో చట్టం అమల్లోకి రాలేదు. అయితే CAAకు సంబంధించి విధి విధానాలను తయారుచేయడంతో పాటు.. వెబ్ పోర్టల్‌ను కూడా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. లోక్‌సభ ఎన్నికలకు ముందే దీన్ని అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. పౌరసత్వ సవరణ చట్టంపై కేంద్రం గెజిట్ రిలీజ్ చేసింది.

Gaami collections: కలెక్షన్ల వర్షం.. ‘గామి’ మూడు రోజుల కలెక్షన్స్..
ఏంటీ పౌరసత్వ సవరణ చట్టం (CAA) ?
పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గనిస్తాన్ నుంచి భారత్‌కు వలస వచ్చిన ముస్లిమేతరుల దగ్గర సరైన డాక్యుమెంట్స్ లేకపోయినా వాళ్ళకు పౌరసత్వం ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం పౌరసత్వ సవరణ చట్టం 2019 (సీఏఏ)ని తీసుకొచ్చింది. 2014 డిసెంబర్ 31 కంటే ముందు ఈ మూడు దేశాల నుంచి మన దేశానికి వచ్చిన హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు, బౌద్ధులు, పార్శీలకు CAA వర్తిస్తుంది. ఈ వర్గాల వారు మూడు దేశాల్లో మైనార్టీలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నారనీ, అందుకే భారత్‌లో వారికి పౌరసత్వం ఇస్తామని బీజేపీ చెబుతోంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పౌరసత్వం ఇస్తామని చెప్పి మోసం చేసిందంటున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. దేశ విభజన జరిగినప్పుడు పౌరసత్వం కల్పిస్తామని హామీ ఇచ్చి ఎందుకు వెనక్కి తగ్గిందని ఈమధ్యే ప్రశ్నించారు. CAA పేరు చెప్పి ముస్లింలను భయపెడుతున్నారని, దేశంలో ఉండే ముస్లింల పౌరసత్వానికి ఎలాంటి ఇబ్బంది ఉండదని హామీ ఇచ్చారు అమిత్ షా.

పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్గానిస్తాన్‌లో చిత్రహింసలు భరించలేక మన దేశానికి శరణార్థులుగా వచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పిస్తామని చెప్పారు. 2019 ఎన్నికల మేనిఫెస్టోలో సిఏఏను బీజేపీ పొందుపర్చింది. అనంతరం అధికారంలోకి వచ్చిన తర్వాత 2019లో దీనికి చట్టం చేసింది. దీని అమలుకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకోసం పౌరసత్వ సవరణ చట్టం 1955కి 2019లో కేంద్రం సవరణ చేసింది. అయితే, ఇంతకాలం దీనికి సంబంధించి పూర్తి నిబంధనలు రూపొందించలేదు. లోక్‌సభ ఎన్నికల ముందే ఈ చట్టం తీసుకొస్తామని చెప్పిన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఇచ్చారు. దీని ప్రకారమే ఈ చట్టం ఈ రోజు నుంచి అమలులోకి వచ్చింది.