Telangana Elections 2023: నారాయణఖేడ్ కాంగ్రెస్ అభ్యర్థి మార్పు.. సురేష్ షెట్కార్ స్థానంలో సంజీవ రెడ్డి

నామినేషన్లకు ఈ రోజే చివరి రోజు అనే సంగతి తెలిసిందే. నిజానికి నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ కోసం పట్లోళ్ల సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే హైకమాండ్ సురేశ్ షెట్కర్‌ వైపే మొగ్గు చూపి, ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించింది.

  • Written By:
  • Publish Date - November 10, 2023 / 02:03 PM IST

Telangana Elections 2023: ఉమ్మడి మెదక్ జిల్లా, నారాయణఖేడ్ అసెంబ్లీ స్థానం నుంచి తమ పార్టీ తరఫున పోటీ చేయనున్న అభ్యర్థిని చివరి నిమిషంలో మార్చింది కాంగ్రెస్. నారాయణఖేడ్ నుంచి మొదట సురేష్ షెట్కర్‌కు అసెంబ్లీ సీటు కేటాయించింది కాంగ్రెస్. అయితే, ఆయన చివరి నిమిషంలో పోటీ నుంచి తప్పుకొన్నారు. దీంతో ఉన్న పళంగా సీటును పట్లోళ్ల సంజీవ రెడ్డికి కేటాయించింది కాంగ్రెస్. దీంతో శుక్రవారం పట్లోళ్ల సంజీవ రెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు.

Telangana BSP : ఐదో జాబితా విడుదల చేసిన తెలంగాణ బీఎస్పీ.. పార్టీ అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్..

నామినేషన్లకు ఈ రోజే చివరి రోజు అనే సంగతి తెలిసిందే. నిజానికి నారాయణఖేడ్ నుంచి టిక్కెట్ కోసం పట్లోళ్ల సంజీవ రెడ్డి, సురేష్ షెట్కార్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. అయితే హైకమాండ్ సురేశ్ షెట్కర్‌ వైపే మొగ్గు చూపి, ఆయనకే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించింది. అయినప్పటికీ, సంజీవరెడ్డి మాత్రం నామినేషన్ల చివరిరోజు వరకు టికెట్ కోసం ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో అటు కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ అంశంపై ఇద్దరిమధ్యా చర్చలు జరిపింది. ఇద్దరి మధ్యా రాజీ కుదిర్చారు. కేసీ వేణుగోపాల్ మధ్యవర్తిత్వంతో చివరి నిమిషంలో సురేష్ షెట్కర్‌ పోటీ నుంచి తప్పుకున్నారు. అంతేకాదు.. పట్లోళ్ల సంజీవ రెడ్డికి తన మద్దతు ఉంటుందని తెలిపారు. ఆయనను గెలిపించుకుంటానని, నామినేషన్ వేసే కార్యక్రమానికి స్వయంగా తానే వెళ్ళి మద్దతు పలుకుతానని తెలిపారు. దీంతో సంజీవరెడ్డి నామినేషన్ వేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు సురేష్‌ షెట్కార్‌‌కు జహీరాబాద్ ఎంపీ సీటు ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడంతో సమస్య కొలిక్కి వచ్చింది.

మొదట్లో తనకు కాంగ్రెస్ టిక్కెట్ రాకపోతే.. పార్టీ మారేందుకు కూడా వెనుకాడనని సురేష్ షెట్కార్ ప్రకటించారు. కానీ, చివరి నిమిషంలో సంజీవ రెడ్డికి మద్దతు తెలపడం హాట్ టాపిక్‌గా మారింది. అయితే, నారాయణఖేడ్ టిక్కెట్‌ను సురేష్ షెట్కర్‌కు, పటాన్‌చెరు టిక్కెట్‌ను నీలం మధుకు కేటాయించడంపై కాంగ్రెస్ సీనియర్ నేత దామోదర రాజనర్సింహా అసంతృప్తి వ్యక్తం చేశారు. కానీ, ఆయన డిమాండ్ మేరకు కాంగ్రెస్ చివరి నిమిషంలో అభ్యర్థుల్ని మార్చింది. దీంతో కాంగ్రెస్‌‌లో దామోదర రాజనర్సింహా తన పట్టు నిరూపించుకున్నారు.