GUDIVADA : ఇదేంది గుడివాడ… మళ్లీ వైసీపీని ఇరికించావ్ గా !!

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏవేవో మాట్లాడి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్.

వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే ఏవేవో మాట్లాడి జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. మంత్రి అన్న సంగతి కూడా మర్చిపోయి డ్యాన్సులు వేయగా… పరిశ్రమల శాఖ మంత్రిగా అనవసరమైన కామెంట్స్ తో సోషల్ మీడియాలో బాగా ట్రోల్ అయ్యారు. ఇప్పుడు వైసీపీ దిగిపోయాక కూడా నోరు అదుపులో పెట్టుకోవట్లేదు. జగన్ ని అడ్డంగా ఇరికించేస్తున్నారు. విశాఖలో శివార్లలోని భీమిలీలో ఎర్రమట్టి దిబ్బలపై గుడివాడ అమర్నాథ్ చేసిన కామెంట్స్ బూమరాంగ్ అయ్యాయి.
కార్పొరేటర్ గా ఉన్న అమర్నాథ్ ను ఎమ్మెల్యేగా చేశారు వైసీపీ అధినేత జగన్. ఆ తర్వాత ఏకంగా మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా పరిశ్రమల శాఖ.

ఆ శాఖకు సంబంధించి ఏవేవో మాట్లాడి కాంట్రోవర్సీ అయ్యారు. ఏపీకి అప్పడాలు, వడియాల పరిశ్రమలు తీసుకొచ్చినట్టు గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పటికీ ఆ కామెంట్స్ సోషల్ మీడియాలో తిరుగుతూనే ఉన్నాయి. లేటెస్ట్ గా విశాఖ భీమిలీలో ఎర్రమట్టి దిబ్బల దగ్గర సెల్ఫీ దిగుతూ చేసిన కామెంట్స్ వైసీపీని అడ్డంగా ఇరికించేశాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెల రోజులే అయింది. అయితే ఈ ప్రభుత్వంలో అక్రమాలు జరుగుతున్నాయనీ… ఈ ఎర్రమట్టి దిబ్బలను తవ్వేశారంటూ కామెంట్స్ చేశారు గుడివాడ. కానీ అక్కడి దిబ్బలు చూస్తే… వైసీపీ హయాంలోనే ఎప్పటి నుంచో తవ్వకాలు మొదలైనట్టు తెలుస్తోంది. దాంతో కూటమి పార్టీ లీడర్లకు ఎర్రమట్టి వ్యవహారం ఆయుధంలాగా దొరికింది. దొంగే దొంగ అంటూ సెల్ఫ్ గోల్ చేసుకున్నారంటూ మాజీ మంత్రి గుడివాడపై టీడీపీ అభిమానులు ట్రోలింగ్ మొదలుపెట్టారు. ఆయన చేసిన ఈ పనికిమాలిన పనితో మమ్మల్ని ఇబ్బంది పెట్టాడని వైజాగ్ వైసీపీ లీడర్లు మండిపడుతున్నారు.

ఎర్రమట్టి దిబ్బల తవ్వకాలకు సంబంధించి… డిప్యూటీ సీఎం, పర్యావరణ శాఖ మంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ కు భారీగా ఫిర్యాదులు అందాయి. పర్యావరణాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. దాంతో పవన్ విచారణకు ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆ ప్రాంతానికి వెళ్ళి ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. కానీ ఇవన్నీ పట్టించుకోకుండా… గుడివాడ అమర్నాథ్ సడన్ గా ఎర్రమట్టి దిబ్బల దగ్గరకెళ్ళి సెల్ఫీలు తీస్తూ అధికార పార్టీని ఇరుకున పెట్టాలని పిచ్చి ప్లాన్ వేశారు. ఇప్పటికే విజయసాయి రెడ్డి ఎపిసోడ్ తో మింగ లేక… కక్కలేక అన్నట్టుంది వైసీపీ పరిస్థితి. ఇప్పుడు అమర్నాథ్ మళ్ళో వివాదంలో ఇరికించాడని ఆ పార్టీ లీడర్లు ఫైర్ అవుతున్నారు. టీడీపీ, జనసేన లీడర్లు అమర్ నాథ్ ఫోటోపై సెటైర్లు వేస్తూ పండగ చేసుకుంటున్నారు. కోడిగుడ్డు మాజీ మంత్రి కోడి బుర్ర అంటూ మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు.