FILES MISSING: తెలంగాణలో…. పాత ఫైల్స్ ఎత్తుకుపోతున్నరు!

తెలంగాణలో అధికార మార్పిడి జరిగింది. ఇదే సమయంలో.. మాజీ మంత్రుల ఆఫీసుల్లో ఫైల్స్ మిస్సింగ్, ఫర్నిచర్ తరలింపు ఘటనలు దుమారం రేపుతున్నాయి. హైదరాబాద్‌లో ఒకే రోజు రెండు కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. మరోవైపు.. సీఎంవోలో ఫేక్ ప్రొటోకాల్ ఆఫీసర్‌గా చలామణి అవుతున్న కేటుగాడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

  • Written By:
  • Publish Date - December 10, 2023 / 09:15 AM IST

హైదరాబాద్‌లో వరుసగా మాజీ మంత్రుల ఆఫీసుల్లో ఫైల్స్ మిస్సింగ్, ఫర్నిచర్ తరలిస్తున్న ఘటనలు కలకలం రేపుతున్నాయి. కాంగ్రెస్ గెలవడంతో.. రాష్ట్రంలో అధికార మార్పిడి జరుగుతోంది. మాజీ మంత్రులు తమ ఆఫీసులు ఖాళీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే.. మాసబ్‌ట్యాంక్‌లోని పశుసంవర్ధక శాఖలో ఫైల్స్‌ మాయం అయ్యాయి. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్…. OSD కల్యాణ్ ఆఫీసులో ఫైల్స్ మిస్ అయ్యాయి. కిటికీ గ్రిల్స్‌ తొలగించి దుండగులు ఫైల్స్‌ ఎత్తుకెళ్లారు. దీంతో.. సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్‌కు ఫిర్యాదు చేసారు అధికారులు. బషీర్‌బాగ్‌ విద్యా పరిశోధనా శిక్షణా సంస్థలో చోరీకి ప్రయత్నించారు దుండుగులు. ఆటోలో ఫైల్స్, ఫర్నిచర్ తరలిస్తుండగా గమనించిన అధికారులు… అడ్డుకున్నారు. దాంతో ఆటోను అక్కడే వదిలేసి పారిపోయారు.  ఇదే ఆఫీసులో మాజీ మంత్రి సబిత ఇంద్రారెడ్డి ఛాంబర్ ఉంది.

ఫైల్స్ మిస్సంగ్ ఇష్యూ కొనసాగుతుండగానే.. తెలంగాణ CMOలో సీఎం పబ్లిసిటీ సెల్‌లో ఫేక్ ప్రొటోకాల్ ఆఫీసర్‌గా చలామణి అవుతున్న ప్రవీణ్‌సాయిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ల్యాండ్ సెటిల్మెంట్స్, అసైన్డ్ ల్యాండ్…. రీఅసైన్డ్ చేస్తానంటూ మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు. కొందరికి సీఎం ప్రొటోకాల్ స్టిక్కర్స్ కూడా ఇప్పించాడు ప్రవీణ్ సాయి. అంతేకాదు.. హోంమంత్రి లెటర్ హెడ్ తో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడ్డాడు. వనస్థలిపురంలో ఉంటున్న ప్రవీణ్ సాయి…. చాలామందికి శఠగోపం పెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ప్రవీణ్ సాయిని అరెస్టు చేసిన పోలీసులు.. ఇన్నోవో కార్, సెల్ ఫోన్ సీజ్ చేశారు. మొత్తంగా.. అధికార మార్పిడీ జరిగే సమయంలో ఫైల్స్ మాయం కావడం, వాటిని ధ్వంసం చేయడం, ఫర్నిచర్ తరలించడం.. లాంటి ఘటనలు చాలా అనుమానాలు కలిగిస్తున్నాయి.