TELANGANA GOVT: శాసనసభ రద్దు చేసిన గవర్నర్‌.. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధం..

తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్‌ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం గెజిట్‌ అందించింది.

  • Written By:
  • Publish Date - December 4, 2023 / 08:10 PM IST

TELANGANA GOVT: తెలంగాణలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోంది. ఏఐసీసీ నుంచి సీఎల్పీ నేత ఎంపికపై క్లారిటీ రాగానే.. రాజ్‌భవన్‌లో సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. తెలంగాణలో కొత్త శాసనసభను ఏర్పాటు చేస్తూ గెజిట్ జారీ అయ్యింది. గవర్నర్‌ తమిళిసైకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌ రాజ్, కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి అవినాష్ కుమార్ నేతృత్వంలోని బృందం గెజిట్‌ అందించింది.

CONGRESS: కాంగ్రెస్‌లో అలజడి.. సీఎం పదవి కోసం సీనియర్ల మధ్య వాగ్వాదం!?

విజయం సాధించిన ఎమ్మెల్యేల జాబితాను కూడా గవర్నర్‌కు సీఈవో వికాస్‌రాజ్‌ అందజేశారు. దీంతో తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ ఏర్పాటైంది. మంత్రివర్గ సిఫార్సు మేరకు రెండో శాసనసభను గవర్నర్‌ తమిళిసై రద్దు చేశారు. కొత్త ముఖ్యమంత్రికి సంబంధించిన ప్రమాణ స్వీకార కార్యక్రమం అధికారికంగా ప్రారంభం కానుంది. ఈసీ బృందం గవర్నర్‌ను కలవడంతో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కూడా గవర్నర్‌ను కలవనుంది. కాంగ్రెస్ శాసన సభాపక్షనేతగా ఎన్నికైన వారి పేరును గవర్నర్‌కు నివేదించి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. ఆ తర్వాత సీఎల్పీ నేతకు డిజిగ్నేటెడ్ సీఎం హోదా ఇచ్చి ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ఆహ్వానిస్తారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం కోసం రాజ్ భవన్‌లో ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

కార్యక్రమం కోసం అవసరమైన కుర్చీలు, టెంట్లు, సహా ఇతరత్రా సామగ్రిని ఇప్పటికే తరలించారు. సాధారణ పరిపాలనా శాఖ, ఆర్‌అండ్‌బీ, జీహెచ్ఎంసీ సహా ఇతర శాఖల అధికారులు అవసరమైన ఏర్పాట్లు చేశారు. శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు రాజభవన్‌కు వెళ్లి.. ప్రస్తుతం అసెంబ్లీ రద్దు తీర్మాన ప్రతిని గవర్నర్‌కు అందించారు. కొత్త మంత్రుల కోసం వాహనాలను అధికారులు సిద్ధం చేశారు. దిల్‌కుష్‌ అతిథి గృహానికి వాహనాలను సిబ్బంది తీసుకొచ్చారు.