HARISH RAO: ఎన్నికల కోడ్ పేరుతో గ్యారెంటీలు ఆపేస్తారా.. ఫిబ్రవరి 20లోపే అమలు చేయాలి: హరీష్ రావు

వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మార్చి 17తో వంద రోజులు పూర్తవుతాయి. కానీ, పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది. కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది.

  • Written By:
  • Publish Date - December 31, 2023 / 05:56 PM IST

HARISH RAO: కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వచ్చే ఫిబ్రవరి 20లోపే అమలు చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. ఫిబ్రవరి చివర్లో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత కోడ్ పేరుతో గ్యారెంటీలను ఆపేస్తారా అని ప్రశ్నంచారు హరీష్ రావు. ప్రభుత్వం చెబుతున్నట్లుగా వంద రోజుల్లో ఆరు గ్యారెంటీల అమలు అంటే.. మార్చి 17 వరకు గడువుందని, కానీ, ఎన్నికల షెడ్యూల్, బడ్జెట్ దృష్ట్యా త్వరగా పథకాల్ని అమలు చేయాలని సూచించారు. బీఆర్ఎస్‌ఎల్పీ కార్యాలయంలో ఆదివారం హరీష్ రావు మీడియాతో మాట్లాడారు.

Rs 100 NOTES: పాత రూ.100 నోట్లు రద్దవుతాయా.. ఆర్బీఐ ఏం చెప్పింది..?

“వంద రోజుల్లో గ్యారెంటీలను అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. మార్చి 17తో వంద రోజులు పూర్తవుతాయి. కానీ, పార్లమెంట్ ఎన్నికలు ముంచుకొస్తున్నాయి. ఫిబ్రవరి నెలాఖరులో ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశముంది. కోడ్ వస్తే గ్యారంటీల అమలులో మరింత జాప్యం జరిగే అవకాశముంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్‌లోపే 6 గ్యారంటీల్లోని మూడు హామీలు అమలు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కోడ్ పేరిట గ్యారంటీల దాటవేత జరుగుతుందా అనే అనుమానాలు ఉన్నాయి. గ్యారంటీలకు సంబంధించి ప్రభుత్వం విధానపరమైన నిర్ణయాలు తీసుకుని జీవోలు విడుదల జేస్తే కోడ్ వచ్చినా ఇబ్బంది ఉండదు. శ్వేత పత్రాలు హామీల ఎగవేతల పత్రాలా అనే అనుమానం కలుగుతోంది. ప్రభుత్వం గ్యారంటీలకు సంబంధించి ఏం చేసినా ఫిబ్రవరి 20లోగానే చెయ్యాలి. కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పెట్టే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది . ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ పెడితేనే హామీల అమలు సాధ్యపడుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టకపోతే అన్నిటీకీ కోతలు తప్పవు. మరో కీలక హామీ రైతులు పండించిన ధాన్యానికి బోనస్. ఈ ఖరీఫ్‌లో ఎలాగూ బోనస్ ఇవ్వలేదు.

యాసంగి పంటకు బోనస్‌పై ప్రభుత్వం ఇపుడే విధాన పరమైన నిర్ణయం తీసుకోకపోతే యాసంగిలో రైతులు నష్టపోతారు. డిసెంబర్ 9 నాడే రైతు భరోసా, రైతు రుణమాఫీ, ఆసరా పెన్షన్ల పెంపు, 200 యూనిట్లలోపు విద్యుత్ బకాయిల మాఫీ అమలు చేస్తామని రేవంత్ ఎన్నికల సభల్లో హామీలు ఇచ్చారు. డిసెంబర్ 9 గడిచిపోయినా అవి అమలు కాలేదని ప్రజలు ఆందోళనలో ఉన్నారు. ఆరోగ్య శ్రీ మొత్తాన్ని పది లక్షల రూపాయలకు పెంచామన్నారు. ఎంత మందికి వర్తించిందో వివరాలు ఇవ్వండి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే పది లక్షల ఆరోగ్య శ్రీ అమలయ్యింది. ఆర్బీఐకి 13వేల కోట్ల రూపాయల అప్పు తీసుకోవడానికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. డిసెంబర్‌లో 1400 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకున్నారు. నిరుద్యోగ భృతి పై డిప్యూటీ సీఎం భట్టి.. రాహుల్, ప్రియాంక ఇచ్చిన హామీలకు విరుద్ధంగా మాట్లాడారు. జాబ్ కేలండర్ ప్రకటించిన వాళ్ళు ఇప్పట్నుంచే మార్గ దర్శకత్వాలు రూపొందించుకోవాలి కదా. గ్యారంటీలు ఇచ్చినపుడు బడ్జెట్ గురించి కాంగ్రెస్ వాళ్లకు అవగాహన లేదా..? సీఎం స్థాయి వ్యక్తి వాహనాలు దాచిపెట్టడం అని మాట్లాడటం తగదు.

ప్రభుత్వం దాచడం ఏమి ఉంటుంది..? బుల్లెట్ ప్రూఫ్ కోసం వాహనాలు ఎవ్వరైనా విజయవాడకు పంపాల్సిందే. అవి సీఎం వాడుకోరా..? ప్రభుత్వం వాడుకోదా..? పార్లమెంటు ఎన్నికలలోపు కాంగ్రెస్ గ్యారంటీలకు మార్గదర్శకాలు ఇచ్చి జీవోలు విడుదల చేయండి. ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘన జరుగుతోంది. నర్సాపూర్, జనగామ, హుజురాబాద్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో మా ఎమ్మెల్యేలకు గౌరవం ఇవ్వకుండా ఓడిపోయిన కాంగ్రెస్ నేతలకు అధికారులు ఆహ్వానాలు పంపారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో మా ఎమ్మెల్యేలకు అవమానం జరుగుతోంది. పార్లమెంటు ఎన్నికలకు మా వ్యూహాలు మాకు ఉన్నాయి” అని హరీష్ రావు వ్యాఖ్యానించారు.