CHANDU : నువ్వులేని లోకంలో నేను ఉండలేను… పవిత్ర కోసం ప్రాణం తీసుకున్న చందు

తెలుగు టీవీ సీరియల్స్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర చనిపోవడాన్ని తట్టుకోలేని చందు... పవిత్ర లేని లోకంలో ఉండలేనని అంటూ వెళ్లిపోయాడు.

 

 

 

తెలుగు టీవీ సీరియల్స్‌ నటుడు చందు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో నటి పవిత్ర చనిపోవడాన్ని తట్టుకోలేని చందు… పవిత్ర లేని లోకంలో ఉండలేనని అంటూ వెళ్లిపోయాడు. పవిత్ర-చందు ఆరేళ్ళుగా సహజీవనం చేస్తున్నారు. మరణానికి ముందు… ఇవాళ పవిత్ర పుట్టినరోజు… నన్ను రమ్మంటోంది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు చందు.

బుల్లితెర నటుడు చంద్రకాంత్‌ అలియాస్‌ చందు బలవన్మరణానికి పాల్పడ్డాడు. హైదరాబాద్‌ మణికొండలోని అల్కాపూర్ కాలనీలో గల తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. చందు త్రినయిని, రాధమ్మ పెళ్లి, కార్తీక దీపం తదితర TV సీరియల్స్‌లో నటించాడు. ఆరేళ్లుగా బుల్లితెర నటి పవిత్ర జయరామ్‌తో సహజీవనం చేస్తున్నాడు. అయితే, ఇటీవల రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోయింది. పవిత్ర ఇక లేదనే వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు చందు. ఇటీవలే పవిత్ర పుట్టినరోజు సందర్భంగా తనను రమ్మంటోంది అంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు చందు. అంతే కాదు తనకు బ్రెయిన్ సంబంధ వ్యాధి ఉన్నట్టు చెప్పాడు. త్వరలోనే తాను చనిపోతానన్నాడు.

గత కొన్ని రోజులుగా పవిత్రతో తన వీడియోలు, ఫొటోలకు ఎమోషనల్‌ సాంగ్స్‌తో యాడ్ చేసి సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నాడు చందు. నా పవి ఇక లేదు… ప్లీజ్‌ వెనక్కు వచ్చేయ్ అని ఓ పోస్టు పెట్టాడు చందు. అలాగే, చనిపోయే ముందు కూడా పవిత్రతో దిగిన సెల్ఫీని పోస్టు చేశాడు. పాపా… నీతో దిగిన లాస్ట్ పిక్ రా… అని క్యాప్షన్‌ పెట్టాడు చందు. నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్లిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను… ఒకసారి మామ అని పిలవవా… అని పోస్టు పెట్టాడు. చందు పెట్టిన పోస్టులు చూసి… అతన్ని వారించే ప్రయత్నం చేశారు స్నేహితులు. అయితే, తాను పిచ్చివాడిగానో… తాగుబోతుగానే మారిపోతే ఇంట్లో వాళ్లు ఇబ్బందిపడతారన్నాడు చందు. ఈ జన్మ ఇక చాలు… అంటూ సూసైడ్ చేసుకున్నాడు.

చందు 2015 లోనే శిల్పా అనే అమ్మాయిని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే, పవిత్ర జయరామ్‌తో ఆరేళ్ళుగా కలసి ఉంటున్నాడు. త్వరలో పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. మహబూబ్ నగర్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర చనిపోయింది. ఆమె చనిపోయిన రోజు నుంచి షాక్ లోనే ఉన్నాడు చందు. ఆమె మరణాన్ని జీర్ణించుకోలేకపోయాడు. పవిత్ర లేని జీవితం కష్టం అనుకున్నాడు. భార్య… పిల్లలు… ఫ్రెండ్స్ వీళ్లందరి కంటే పవిత్ర ముఖ్యం అనుకున్నాడు. పవిత్ర పిలుస్తోంది అంటూ చందూ ఆత్మహత్య చేసుకున్నాడు.