Constable Ramesh: ప్రియుడితో కలిసి భర్తను లేపేసిన భార్య

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిందో భార్య. ఈ సంఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది.

  • Written By:
  • Publish Date - August 3, 2023 / 06:44 PM IST

విశాఖ వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రమేష్‌ అనే వ్యక్తిని.. అతని భార్య పక్కా ప్లాన్‌ ప్రకారం హత్య చేసింది. ప్రియుడు, అతని స్నేహితుడి సాయంతో.. స్కెచ్ వేసి మరీ భర్త ప్రాణాలు తీసింది. బుధవారం ఇంట్లో అనుమానాస్పద స్థితిలో రమేష్ చనిపోయాడు. ఇది హత్యే అని ముందు నుంచి కుటుంబసభ్యులు ఆరోపించగా.. తీగలాగితే అసలు డొంక కదిలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని రమేష్‌ను అతని భార్య హతమార్చింది. ట్యాక్సీ డ్రైవర్‌తో రమేష్‌ భార్య కొద్దిరోజులుగా రిలేషన్‌లో ఉంది. ఐతే ఈ బంధానికి అడ్డుగా ఉన్నాడని.. రమేష్ పడుకున్న సమయంలో దిండు అడ్డుపెట్టి ఊపిరాకుండా చేసి భార్య చంపేసినట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత రమేష్‌ది గుండెపోటుగా చిత్రీకరించే ప్రయత్నం చేసింది. గుట్టుచప్పుడు కాకుండా అంత్యక్రియలు చేసేందుకు ఏర్పాట్లు చేసింది. ఐతే రమేష్ మరణంపై మొదటి నుంచి అనుమానంతో ఉన్న బంధువులు.. పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రమేష్‌ భార్య.. ట్యాక్సీ డ్రైవర్‌తో వివాహేతర బంధం సాగిస్తోందని.. దీన్ని మందలించినందుకే అడ్డు తొలగించుకునే ప్రయత్నంలో హత్య చేశారని తేలింది. నిందితురాలిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. కానిస్టేబుల్‌ రమేష్ హత్యతో విశాఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. అడ్డగోలు సంబంధాల మాయలో పడి.. ప్రాణాలు తీసుకోవడం, తీయడం ఏంటి అంటూ జనాలు ఫైర్ అవుతున్నారు.