IND VS ENG: తొలిరోజు టీమిండియాదే.. సత్తా చాటిన బౌలర్లు.. అదరగొట్టిన బ్యాటర్లు

తొలి రోజు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు అడ్డుకున్నారు. స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.

  • Written By:
  • Publish Date - March 7, 2024 / 05:49 PM IST

IND VS ENG: ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న ఐదో టెస్టులో తొలి రోజు టీమ్‌ ఇండియా పై చేయి సాధించింది. ఇటు బౌలింగ్‌లో, అటు బ్యాటింగ్‌లో అదరగొట్టి.. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తా చాటింది. ముఖ్యంగా బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌటైంది. తొలి రోజు టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లండ్ బ్యాటర్లను భారత బౌలర్లు అడ్డుకున్నారు. స్పిన్ త్రయం అశ్విన్, కుల్దీప్ యాదవ్ చెలరేగడంతో తొలి ఇన్నింగ్స్‌‌లో ఇంగ్లండ్ 57.4 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌటైంది.

Isha Ambani: ఇషా స్పెషల్ ఎంట్రీ.. ఒక్క బ్లౌజ్ ధరే కోట్ల రూపాయలు

కుల్‌దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ ధాటికి ఇంగ్లండ్ బ్యాటర్లు వణికిపోయారు. పెవిలియన్‌కు క్యూ కట్టడానికి పోటీపడ్డారు. జాక్ క్రాలే మినహా మిగిలిన ఇంగ్లిష్ బ్యాటర్లందరూ తేలిపోయారు. తొలి వికెట్‌కు బెన్ డకెట్‌తో కలిసి జాక్ క్రాలే 64 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. కానీ కుల్‌దీప్ మాయతో ఇంగ్లండ్ టపాటపా వికెట్లను చేజార్చుకుంది. 2 వికెట్లకు 100 రన్స్ స్కోర్‌తో రెండో సెషన్‌ను ఆరంభించిన ఇంగ్లండ్‌ను కుల్‌దీప్, అశ్విన్ కోలుకోలేని దెబ్బతీశారు. తన కెరీర్‌లో 100వ టెస్టు ఆడుతున్న అశ్విన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు చొప్పున.. మొత్తం నాలుగు వికెట్లు పడగొట్టాడు. మరోవైపు కుల్‌దీప్ యాదవ్ టెస్టుల్లో 50 వికెట్ల మార్క్‌ను అందుకున్నాడు. కుల్‌దీప్ యాదవ్ 5 వికెట్లు, అశ్విన్ 4 వికెట్లు, జడేజా ఒక వికెట్ పడగొట్టారు. దీంతో మూడో సెషన్ ఆరంభమైన కాసేపటికే ఇంగ్లాండ్ కథ ముగిసింది. ఇంగ్లాండ్ 218 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్‌ జాక్‌ క్రాలే (79) మినహా మిగిలిన బ్యాటర్లు అంతగా ప్రభావం చూపలేకపోయారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. తొలిరోజు ఆట ముగిసేసరికి 135/1 స్కోరుతో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ ఇండియా ఇంకా 83 పరుగుల వెనకంజలో ఉంది. ఇటీవల అద్భుతంగా రాణిస్తున్న యశస్వి జైస్వాల్ ఈ మ్యాచులో కూడా ఆకట్టుకున్నాడు. 58 బంతుల్లో 57 పరుగులు చేసి, మరోసారి ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు.

మొదటి రోజు ఆట ముగిసే సరికిరోహిత్ శర్మ 52 పరుగులతో, శుభ్‌మన్ గిల్ 26 పరుగులతో క్రీజులో ఉన్నారు. భారత ఓపెనర్లు బ్యాటింగ్ చేసిన తీరు టీ20 మ్యాచ్‌ని తలపించింది. ఈ మ్యాచులో యశస్వి జైస్వాల్ రికార్డుల మోత మోగించాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా 1000 పరుగులు చేసిన తొలి ఆసియా బ్యాటర్‌గా రికార్డు సాధించాడు. ఈ క్రమంలో భారత మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీతోపాటు, రోహిత్ శర్మ రికార్డులను దాటాడు. ఈ రికార్డే కాకుండా ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా.. 700 ప్లస్ పరుగులు చేసిన తొలి భారత క్రికెటర్‌గా యశస్వి చరిత్రకెక్కాడు. తొలి ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ చేసి వెనుదిరిగిన జైస్వాల్ ఓవరాల్‌గా..ఈ సిరీస్‌లో 712 పరుగులు చేశాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించాడు. రెండో ఇన్నింగ్స్‌లో 41 పరుగులు చేస్తే ఇరు జట్ల మధ్య జరిగిన టెస్ట్‌ సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా నిలవనున్నాడు.