IND VS ENG: ఇన్నింగ్స్ తేడాతో ఇంగ్లండ్‌పై భారత్ ఘన విజయం..

ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో టెస్టు సిరీస్ 4-1తో భారత్ కైవసమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు మినహా మిగతా నాలుగు టెస్టుల్లో వరుసగా ఇండియా గెలవడం విశేషం.

  • Written By:
  • Updated On - March 9, 2024 / 02:31 PM IST

IND VS ENG: ధర్మశాల వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 64 పరుగుల తేడాతో ఇంగ్లండ్‌పై గెలిచింది. దీంతో టెస్టు సిరీస్ 4-1తో భారత్ కైవసమైంది. ఐదు టెస్టుల సిరీస్‌లో హైదరాబాద్‌లో జరిగిన తొలి టెస్టు మినహా మిగతా నాలుగు టెస్టుల్లో వరుసగా ఇండియా గెలవడం విశేషం. ఈ సిరీస్‌లో భారత్ అన్ని విభాగాల్లోనూ అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. ఇండియాలో బజ్‌బాల్‌తో విక్టరీ సాధించాలన్న ఇంగ్లండ్‌కు టీమిండియా గట్టి షాకిచ్చింది.

KCR: కేసీఆర్ మీద పోలీస్‌ కంప్లైంట్‌.. ప్రణీత్‌ రావు వెనక ఉంది ఆయనేనా..?

కొంతకాలంగా బజ్‌బాల్ ఆటతీరుతో సక్సెస్ అవుతున్న ఇంగ్లండ్.. ఇండియాలో మాత్రం బోర్లాపడింది. ఐదో టెస్టులో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు కట్టడి చేశారు. 218 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఆలౌటైంది. తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన భారత్.. అద్భుత ప్రదర్శన చేసింది. రోహిత్ శర్మ (103), శుభ్‌మన్ గిల్ (110) సెంచరీలతో చెలరేగగా, యశస్వి జైశ్వాల్ (57), పడిక్కల్ (65) సర్ఫరాజ్ ఖాన్ (56) అర్ధ సెంచరీలతో రాణించారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 477 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో ఇండియాకు 257 పరుగుల ఆధిక్యం లభించింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్.. రెండు పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. తర్వాత కూడా బ్యాటింగ్‌లో పుంజుకోలేకపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జో రూట్ ఒక్కడే అర్ధ సెంచరీ సాధించాడు. రూట్.. 84 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లు ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. ఫలితంగా 195 పరుగులకే ఇంగ్లండ్ ఆలౌటైంది. దీంతో ఇండియాకు ఇన్నింగ్స్ 64 పరుగులతో భారీ విజయం దక్కింది. భారత బౌలర్లలో అశ్విన్, కుల్దీప్ అద్భుతంగా రాణించారు.

తొలి ఇన్నింగ్స్‌లో కుల్దీప్ 5 వికెట్లు తీయగా, అశ్విన్ 4 వికెట్లు తీశాడు. జడేజాకు ఒక వికెట్ లభించింది. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో అశ్విన్ 5 వికెట్లు తీయగా, కుల్దీప్ 2, బుమ్రా 2, జడేజా 1 వికెట్ తీశాడు. ఈ టెస్టు సిరీస్‌లో యశస్వి జైశ్వాల్ బ్యాటింగ్‌లో అద్భుతంగా రాణించి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ఐదు మ్యాచుల సిరీస్‌లో జైశ్వాల్ 712 పరుగులు సాధించాడు. అలాగే అత్యధిక సిక్సర్లు (26) బాదాడు. జైశ్వాల్ తర్వాత గిల్ 452 పరుగులతో ఈ సిరీస్‌లో రెండో స్థానంలో ఉన్నాడు. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ అత్యధిక వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో విజయంతో టీమిండియా.. వరల్డ్ టెస్ట్ క్రికెట్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.