T20, World Cup 2024 : ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు.. శభాష్ ఛాంపియన్స్

17 ఏళ్ళ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లు సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చారు.

17 ఏళ్ళ తర్వాత టీ ట్వంటీ వరల్డ్ కప్ గెలిచిన భారత క్రికెటర్లు సగర్వంగా స్వదేశానికి తిరిగి వచ్చారు. ఎయిర్ పోర్టులో అభిమానులు ఘనస్వాగతం పలికిన వేళ షెడ్యూల్ ప్రకారం ప్రధాని నరేంద్ర మోదీతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ కు టీమ్ అంతా వెళ్ళింది. విశ్వవిజేతలను మోదీ ప్రత్యేకంగా అభినందించారు. విశ్వవేదికపై భారత్‌ను విజేతగా నిలిపిన రోహిత్ సేన‌ను మోదీ ప్రశంసలతో ముంచెత్తారు. కాగా, మోదీని కలవడానికి భారత ఆటగాళ్లు స్పెషల్ జెర్సీ ధరించారు. టీ20 వరల్డ్ కప్‌లో బరిలోకి దిగిన జెర్సీ తరహాలోనే స్పెషల్ జెర్సీని డిజైన్ చేసి ఇండియా కింద ఛాంపియన్స్ అని రాశారు.

కాగా ప్రతీ ప్లేయర్ ను మోదీ ఆప్యాయంగా పలకరించి వరల్డ్ కప్ విశేషాలు అడిగి తెలుసుకున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ, ఫైనల్లో కీలక ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీతో పాటు కోచ్ రాహుల్ ద్రావిడ్ ను ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. ఆటగాళ్ళందరితోనూ ప్రత్యేకంగా ఫోటోలు దిగిన మోదీ వారి విజయాన్ని చూసి దేశం ఉప్పొంగిందంటూ వ్యాఖ్యానించారు.