Revanth Cabinet : తెలంగాణ కొత్త మంత్రులు వీళ్లే!

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళయిందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటనతో.. ఈ ప్రచారం మరింత జోరందుకుంది. మంత్రివర్గ విస్తరణకు.. కాంగ్రెస్ పెద్దల అనుమతి

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు వేళయిందా అంటే.. అవును అనే సమాధానమే వినిపిస్తోంది. సీఎం రేవంత్‌ ఢిల్లీ పర్యటనతో.. ఈ ప్రచారం మరింత జోరందుకుంది. మంత్రివర్గ విస్తరణకు.. కాంగ్రెస్ పెద్దల అనుమతి కోసమే సీఎం రేవంత్ ఢిల్లీ వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. దీంతో కొత్త మంత్రివర్గంలోకి వచ్చేదెవరు.. ఎవరికి అవకాశాలు ఉన్నాయ్.. ఎవరికి ఏ అంశం కలిసిరాబోతుందనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయ్. ఈ ఆరు స్థానాల కోసం భారీగానే పోటీ కనిపిస్తోంది. మంత్రి పదవుల భర్తీలో సామాజిక సమీకరణాలకు.. కాంగ్రెస్ హైకమాండ్ పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయ్. దీంతో మంత్రి పదవి రేసులో పలువురి పేర్లు తెరమీదకు వస్తున్నాయ్. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి వెడ్మా బొజ్జు, ప్రేమ్‌సాగర్ రావుతో పాటు గడ్డం వినోద్‌, గడ్డం వివేక్‌ పేర్లు రేసులో వినిపిస్తున్నాయ్.

ఇక ఉమ్మడి నిజామాబాద్ నుంచి సుదర్శన్ రెడ్డి, మదన్‌ మోహన్ రావుకు చాన్స్ ఉందని తెలుస్తోంది. ముదిరాజ్‌ సామాజికవర్గానికి పెద్ద పీట వేయాలని ఫిక్స్ అయిన కాంగ్రెస్‌.. ఆ వర్గానికి చెందిన ఓ నేతను కేబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉంది. దీంతో ముదిరాజ్ సామాజికవర్గానికి చెందిన వాకిటి శ్రీహరి, నీలం మధు పేర్లు మంత్రి పదవి రేసులో ప్రముఖంగా వినిపిస్తున్నాయ్. ఇద్దరిలో నీలం మధుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే, ఎంపీగా పోటీ చేసిన నీలం మధు.. ఓటమి పాలయ్యారు. దీంతో ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిపదవి ఇచ్చే చాన్స్ ఉందని తెలుస్తోంది.

ఇక ఎస్టీ కోటాలో డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్రు నాయక్‌కు పదవి దక్కే చాన్స్ ఉంది. వీళ్లతో పాటు గ్రేటర్ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కోసం కాంగ్రెస్ పెద్దలు ఎదురు చూస్తున్నారు. బీఆర్ఎస్‌ నుంచి గ్రేటర్ పరిధిలో భారీగా వలసలు ఉండే చాన్స్ ఉంది. వారిలో ఒకరిటి మంత్రి పదవి ఇవ్వాలని సీఎం రేవంత్‌తో సహా కాంగ్రెస్‌ పెద్దలు భావిస్తున్నారు. ఇక అటు మైనారిటీ కోటాలో మైనారిటీ కోటాలో ఫిరోజ్‌ ఖాన్‌ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. మరి ఫైనల్‌గా కేబినెట్‌లో కర్చీఫ్‌ వేసేది ఎవరు అన్నది తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే మరి.