Kishan Reddy: దళితుడిని సీఎం చేసే దమ్ముందా.. కేసీఆర్‌కు కిషన్ రెడ్డి సవాల్..

మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే ఆ లేఖల్ని కేసీఆర్ బయటపెట్టాలి. అసలు మెడికల్ కాలేజీలకు దరఖాస్తే చేయలేదు. తలా, తోక లేకుండా మాట్లాడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటు. రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఆలస్యం అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలి.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 07:56 PM IST

Kishan Reddy: తెలంగాణలో దళితుడిని సీఎం చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా అని ప్రశ్నించారు కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy). కాంగ్రెస్ (CONGRESS) పార్టీ బీసీని సీఎం చేయగలదా అని ప్రశ్నించారు. బుధవారం కిషన్ రెడ్డి హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా కాంగ్రెస్, బీఆర్ఎస్‌ (BRS)పై విమర్శలు చేశారు. “సిగ్గు లేకుండా కేసీఆర్ అబద్ధాలు మాట్లాడుతున్నారు. మెడికల్ కాలేజీల కోసం దరఖాస్తు చేసుకుని ఉంటే ఆ లేఖల్ని కేసీఆర్ బయటపెట్టాలి.

REVANTH REDDY: రైతులను ఆదుకుంటామని చెప్పి కేసీఆర్ మాట తప్పాడు: రేవంత్ రెడ్డి

అసలు మెడికల్ కాలేజీలకు దరఖాస్తే చేయలేదు. తలా, తోక లేకుండా మాట్లాడటం కేసీఆర్ కుటుంబానికి అలవాటు. రీజనల్ రింగ్ రోడ్ ఎందుకు ఆలస్యం అవుతుందో కేసీఆర్ సమాధానం చెప్పాలి. దళితుడిని సీఎం చేసే దమ్ము కేసీఆర్‌కు ఉందా..? కేటీఆర్‌ను సీఎం చేసినట్లు కేసీఆర్.. ఫాం హౌజ్‌లో పడుకుని పగటి కలలు కంటున్నారు. మహిళా మంత్రి (నిర్మలా సీతారామన్)ని పట్టుకుని సిగ్గుందా అని అడగటానికి కేసీఆర్‌కు సిగ్గుందా..? తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి బీసీ సీఎం అంశంపై చర్చ జరుగుతోంది. ఇప్పటివరకు బీసీ సీఎం కాలేదు. ఈ విషయంలో బీసీ సంఘాలు బీజేపీకి మద్దతు తెలుపుతున్నాయి. బీసీని సీఎం చేసే దమ్ము కాంగ్రెస్‌కు ఉందా..? రాహుల్ గాంధీ (RAHUL GANDHI), కాంగ్రెస్ బీసీలను అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. తొమ్మిదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో తొమ్మిది లక్షల కోట్లు ఖర్చు పెట్టింది. ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు రావాలంటే బీజేపీకి ఓటు వేయాలి.

బీజేపీ అధికారంలోకి రాగానే వరికి కనీస మద్దతు ధర రూ.3,100 ఇస్తాం. రైతులకు ఉచిత కరెంట్ ఇస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అవినీతి, అస్థిరత ఉంటుంది. అదే బీఆర్ఎస్‌ ఉంటే కుటుంబ పెత్తనం ఉంటుంది. రెండు పార్టీలూ ఫ్యామిలీ ప్రైవేటు లిమిటెడ్ పార్టీలుగా మారాయి. బీజేపీ విధానం ధర్మం, దేశం అయితే.. కాంగ్రెస్, బీఆర్ఎస్ విధానాలు అవినీతి, బంధు ప్రీతి మాత్రమే” అని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.