T Congress: బీజేపీ నుంచి కాంగ్రెస్ లోకి ముఖ్య నాయకులు.. కాంగ్రెస్ అభ్యర్దుల తదుపరి జాబితా పై సర్వత్రా ఉత్తంఠ

నేడు ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో నేడు సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశం జరుగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందులో తెలంగాణ ఎన్నికల విషయంలో కొన్ని కీలక పరిణామాలు చేటు చేసుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా కొన్ని వ్యూహాత్మక నిర్ణయాలను తీసుకునే అవకాశం కనిపిస్తోంది.

  • Written By:
  • Publish Date - October 25, 2023 / 09:18 AM IST

కాంగ్రెస్ పార్టీలో ఒకవైపు చేరికలు, మరోవైపు అలకలు కొనసాగుతున్నాయి. ఎన్నికల నామినేషన్ కు సమయం దగ్గరపడుతున్నవేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థుల విషయంలో వ్యూహాత్మక నిర్ణయం తీసుకుంటోంది. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి గతంలో కాంగ్రెస్ ను వీడి బీజేపీలో చేరారు. అక్కడ ఆశించినంత ఫలితం రాకపోవడంతో రేపు, లేదా ఎల్లుండి తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఇలా కీలక నాయకులను బీఆర్ఎస్ పెద్దలకు ధీటుగా బరిలో దింపేందుకు వ్యూహాలను రచిస్తోంది కాంగ్రెస్. ఇప్పటి వరకూ బీజేపీతో అంటకాగిన వివేక్ వెంకట స్వామి కూడా కాంగ్రెస్ లో చేరే అవకాశం కనిపిస్తోంది.

కామారెడ్డి నుంచి బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ బరిలో నిలిచారు. ఇక్కడి నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గతంలో కొడంగల్ నుంచి పోటీ చేసేందుకు సిద్దమైన ఈయన కామారెడ్డి నుంచి కూడా పోటీ చేసే అవకాశం కనిపిస్తోంది. అలాగే మహేశ్వరం నుంచి సబితా ఇంద్ర రెడ్డికి పోటీగా మరో సీనియర్ నాయకుడిని పోటీకి సిద్దం చేస్తున్నట్లు సమాచారం. మునుగోడు కాకుండా సిరిసిల్ల లేదా సిద్దిపేట నుంచి ఏదో ఒక స్థానంలో రాజగోపాల్ రెడ్డిని పోటీ చేయించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. చెన్నూరు నుంచి సీపీఐ ఎప్పటి నుంచో తనకు సీటు కేటాయించాలని కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీని ఒప్పించి మరో సీనియర్ నాయకుడిని బరిలో దింపే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ కీలక నాయకులు విషయంలో ఎక్కడా రాజీపడకుండా రెండు స్థానాల్లో పోటీకి చేసేలా అధిష్టానం నిర్ణయం తీసుకోనుంది. దీంతో కాంగ్రెస్ విడుదల చేసే రెండో జాబితాలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య పలు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక సంక్లిష్టంగా మారింది. ఇలా పక్క పార్టీల నుంచి కాంగ్రెస్ లోకి వచ్చే వారి వల్ల స్థానికంగా పార్టీనే నమ్ముకున్న వాళ్లకు అన్యాయం జరుగుతున్నట్లు భావిస్తున్నారు కొందరు నాయకులు. ఆశావాహుల్లో తీవ్ర అసహనంతోపాటూ అసంతృప్తి నెలకొంది. నేడు జరగబోయే సెంట్రల్ ఎన్నికల కమిటీ సమావేశంలో కమ్యూనిస్ట్ పార్టీలకు కేటాయించే సీట్ల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోనున్నారు. కాంగ్రెస్లో తాజాగా కొందరు సీనియర్ నాయకుల చేరికల ఆధారంగా కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.

T.V.SRIKAR