Koushik Reddy : కౌశిక్ రెడ్డి బ్లాక్ మెయిల్ పై ఈసీ విచారణ:

నన్ను గెలిపించకపోతే కుటుంబంతో కలసి శవయాత్ర చేస్తానంటూ హుజూరాాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఎమోషనల్ బ్లాక్ మెయిల్ సంచలనంగా మారింది. దీనిపై ఎన్నికల కమిషన్ విచారణకు ఆదేశించింది.

  • Written By:
  • Publish Date - November 29, 2023 / 11:54 AM IST

Padi Koushik Reddy Comments: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి చేసిన ఎమోషనల్ బ్లాక్‌మెయిల్ వివాదస్పదమైంది. మీరు గెలిపిస్తే విజయయాత్ర.. లేకపోతే కుటుంబంతో సహా శవయాత్ర చేస్తానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కౌశిక్‌ రెడ్డి కామెంట్స్ పై కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) తీవ్రంగా స్పందించింది.   విచారణ జరిపి.. నివేదిక అందించాలని హుజూరాబాద్‌ ఎన్నికల అధికారులను ఈసీ ఆదేశించింది.

హుజూరాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి మంగళవారం… ప్రచారం చివరిరోజు భార్య, కూతురుతో కలిసి ప్రచారం చేశారు. కార్నర్ మీటింగ్‌లో ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘మీకు దండం పెడతా.. ఒక్క ఛాన్స్ ఇవ్వండి. నాకు ఓటేసి గెలిపించండి. నేను చేయాల్సిన ప్రచారం చేశా.. ఇక సాదుకుంటరో, సంపుకుంటరో మీ ఇష్టం. ఓట్లేసి గెలిపిస్తే నాలుగో తారీఖున నేను విజయయాత్రతో వస్తా.. లేకపోతే నా శవయాత్రకు మీరు రండి’ అంటూ కౌశిక్ రెడ్డి ఓటర్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేశారు. ఈ వ్యాఖ్యలనే ఈసీ నివేదిక కోరింది.

పాడి కౌశిక్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యేగా హుజూరాబాద్ నుంచి పోటీకి దిగారు.  కౌశిక్ రెడ్డి తరపున ఆయన భార్య, కూతురు శ్రీనిక చేసిన ప్రచారం చేశు. హుజూరాబాద్‌లో సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రజాఆశీర్వాద సభలో శ్రీనిక ప్రచారం బాగా వైరల్ అయ్యింది. హుజూరాబాద్ నియోజిక వర్గం నుంచి బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీలో ఉన్నారు. గత ఉప ఎన్నికల్లో ఈటల మీద పోటీ చేసిన కౌశిక్ రెడ్డి ఓడిపోయారు.