KTR: పెండింగ్ బిల్లులపై సర్పంచ్‌ల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా: కేటీఆర్

తెలంగాణలోలాగా ప్రతి పల్లెలో డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, ట్యాంకర్‌లు, ట్రాక్టర్లు, నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని చాలెంజ్ చేస్తున్నా. సర్పంచ్‌లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్‌ రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నా.

  • Written By:
  • Publish Date - January 16, 2024 / 06:45 PM IST

KTR: సర్పంచ్‌లకు రావాల్సిన పెండింగ్‌ బిల్లులపై ప్రభుత్వంతో మాట్లాడటానికి, గొంతు విప్పడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్. గ్రామాల్లో తమ ప్రభుత్వం అమలు చేసినలాంటి పథకాలు ఏ రాష్ట్రంలోనైనా ఉన్నాయా అని ఛాలెంజ్ చేశారు. రాజన్న సిరిసిల్లా జిల్లా కేంద్రంలో మంగళవారం కేటీఆర్ పర్యటించారు. తాజాగా శుభకార్యాలు జరిగిన పలువురు నాయకుల ఇండ్లకు వెళ్ళి కలిశారు.

YS JAGAN Vs SHARMILA: షర్మిలకు పీసీసీ పదవి.. జగన్‌కు నష్టమేనా..?

అనంతరం బిఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సర్పంచ్‌లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. “పదవిలో నుంచి పోయేముందు కూడా గౌరవంగా పంపించాలనే భావనతో ఆత్మీయ సత్కారం కార్యక్రమం ఏర్పాటు చేశాం. పదవులు వస్తాయి.. పోతాయి. అంతేకాని శాశ్వతం కాదు. పదవిలో ఉన్నప్పుడు ఎంత మంచిగా పనిచేశారన్నదే ముఖ్యం. పదవిలో ఉన్నప్పుడు అన్ని విధాలా మంచిగా పనిచేశారు కాబట్టే.. ప్రజలు కెసిఆర్ ముఖ్యమంత్రి కాలేదన్నది జీర్ణించుకోలేక పోతున్నారు. ఓ కవి రాసిన పాట, పల్లే కన్నీరు పెడుతుందోయ్ అనే పాట ప్రభుత్వాన్నే మార్చేసింది. తెలంగాణలోలాగా ప్రతి పల్లెలో డంప్ యార్డ్, పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామాలు, ట్యాంకర్‌లు, ట్రాక్టర్లు, నర్సరీలు లాంటివి ఏ రాష్ట్రంలో ఉన్నాయో చూపించాలని చాలెంజ్ చేస్తున్నా. సర్పంచ్‌లు చాలా కష్టపడి పని చేసి ఓడిఎఫ్ ప్లస్‌ రాష్ట్రంగా మార్చినందుకు సలాం చేస్తున్నా.

2014 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రానికే 82 అవార్డులు వచ్చాయి. దేశంలోనే 30 శాతం అవార్డులు మన రాష్ట్రానికే వచ్చాయని చెప్పడానికి గర్వంగా ఉంది. ప్రధాన మంత్రి సంసద్ ఆవాస్ యోజన పథకంలో దేశంలోనే టాప్ ట్వంటీలో 19 గ్రామాలు మనవే కావడం గొప్ప విషయం. పెండింగ్ బిల్లుల సమస్యపై మీ తరుపున ప్రభుత్వంతో మాట్లాడటానికి, గొంతు విప్పడానికి నేను సిద్దంగా ఉన్నా” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.