Mallareddy Arrest : మాజీ మంత్రి మల్లారెడ్డి, అల్లుడు రాజశేఖర్ రెడ్డి అరెస్ట్

మాజీ మంత్రి మల్లా రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. పేట్ బషీరాబాద్ ఏరియాలో ఓ ల్యాండ్ వ్యవహారంలో తన అనుచరులతో వచ్చి గొడవకు దిగిన మల్లారెడ్డితో పాటు మల్కాజ్ గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Written By:
  • Publish Date - May 18, 2024 / 02:35 PM IST

అధికారం మారితే.. పదవులు పోవడమే కాదు, పరిస్థితులు పూర్తిగా మారిపోతాయ్ అనడానికి.. మాజీమంత్రి మల్లారెడ్డి వ్యవహారమే బెస్ట్ ఎగ్జాంపుల్‌. భూములు కబ్జా చేశారంటూ.. వరుసగా ఆయనపై కేసులు నమోదు అవుతున్నాయ్. ఆ మధ్య అయితే.. మల్లారెడ్డి అల్లుడు రాజశేకర్‌ రెడ్డి కాలేజీలో కూల్చివేతల వరకు వెళ్లింది వ్యవహారం. కారణం ఏదైనా ఆ తర్వాత ఈ టాపిక్ కాస్త సైలెంట్ అయినా.. మల్లారెడ్డి ఇప్పుడు మళ్లీ హాట్‌టాపిక్ అవుతున్నారు. కొంపల్లి దగ్గరలో.. పేట్ బషీరాబాద్ పీఎస్‌ పరిధిలో.. ఓ ల్యాండ్ వ్యవహారంలో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేకర్ రెడ్డి చేసిన రచ్చకు అరెస్ట్ దారితీసింది.  భూవివాదం కేసులో మల్లారెడ్డితో పాటు ఆయన అల్లుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.  మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా సుచిత్ర పరిధిలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలం కోర్టు వివాదంలో ఉంది. ఐతే ఈ స్థలాన్ని కొందరు ఆక్రమించుకుంటున్నారని ఆరోపిస్తూ.. మల్లారెడ్డి, ఆయన అల్లుడు ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి… తమ అనుచరులతో కలిసి స్థలంలో వేసిన భారీ కేడ్లను తొలగించారు. అక్కడున్న రెండున్నర ఎకరాల భూమి తనదే అంటూ వాగ్వాదానికి దిగారు. అయితే అందులో 1.11 గుంటల భూమి తమదంటూ మరో 15మంది అడ్డుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఒక్కొక్కరం 4వందల గజాల చొప్పున గతంలో భూమి కొనుగోలు చేశామన్నది ఆ 15 మంది వాదన. కోర్టు కూడా తమకు అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అంటున్నారు వాళ్లంతా. మల్లారెడ్డి తన అనుచరులతో బెదిరిస్తున్నారని వాపోయారు. పోలీసులు ఇరువురికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కోర్టు ఆర్డర్ ఉండడంతో.. సంఘటన స్థలంలో ఎలాంటి గొడవలు చేయొద్దని రెండు వర్గాలకు పోలీసులు సర్దిచెప్పారు. ఈ ప్రాసెస్‌లో మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డి పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. అయితే పోలీసులు ఎంత చెప్పినా మల్లారెడ్డి ,రాజశేఖర్ రెడ్డి వినలేదు. దాంతో ఇద్దర్నీ అరెస్ట్ చేశారు పోలీసులు.